యూనివర్సిటీల ఛాన్సలర్గా గవర్నర్ను తొలగించే బిల్లుకు కేరళ అసెంబ్లీ ఆమోదం..
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ బాధ్యతల నుంచి గవర్నర్ను తొలగించే బిల్లుకు కేరళ అసెంబ్లీ ఆమోదించింది.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ బాధ్యతల నుంచి గవర్నర్ను తొలగించే బిల్లుకు కేరళ అసెంబ్లీ ఆమోదించింది. విశ్వవిద్యాలయాల ఛాన్సలర్గా గవర్నర్ను భర్తీ చేసి.. ప్రముఖ విద్యావేత్తలను ఉన్నత పదవిలో నియమించే యూనివర్సిటీ చట్టాల (సవరణ) బిల్లును అసెంబ్లీ మంగళవారం ఆమోదిం తెలిపింది. అంతకుముంద ఈ బిల్లుపై గంటల తరబడి అసెంబ్లీలో చర్చ జరిగింది. అనంతరం బిల్లు ఆమోదం పొందిందని కేరళ అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ శ్యాంసీర్ తెలిపారు
గవర్నర్ను ఛాన్సలర్గా తొలగించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. అయితే రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తుల నుండి ఆ పదవికి ఎంపిక చేయాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ ఈ బిల్లుపై చర్చ సందర్భంగా తెలిపింది. ప్రతి యూనివర్సిటీకి వేర్వేరు ఛాన్సలర్లు ఉండాల్సిన అవసరం లేదని.. సెలక్షన్ ప్యానెల్లో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్లు ఉండాలని కూడా పేర్కొంది. అయితే సెలక్షన్ ప్యానెల్లో న్యాయమూర్తి భాగం కాలేరని.. స్పీకర్ ఉత్తమ ఎంపిక అని రాష్ట్ర న్యాయ మంత్రి పి రాజీవ అన్నారు.
అయితే బిల్లుకు సంబంధించి తమ సూచనలను ఆమోదించనందుకు నిరసనగా యూడీఎఫ్ సభను బాయ్కాట్ చేసి వెళ్లిపోయింది. ప్రభుత్వం తీసుకున్న వైఖరిని దృష్టిలో ఉంచుకుని.. కేరళలోని యూనివర్శిటీలను కమ్యూనిస్ట్ లేదా మార్క్సిస్ట్ కేంద్రాలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భయపడి సభా కార్యకలాపాలను బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్షం తెలిపింది. ప్రతిపక్షం సభలో నుంచి వెళ్లిపోయిన తర్వాత అధికార పక్షం మద్దతులో ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ఇక, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం సహా పలు అంశాలపై గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, పినరయి విజయన్ ప్రభుత్వం మధ్య వాగ్వాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయన్ సర్కార్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.