ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్.. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. బీజేపీ వ్యతిరేక పార్టీలతో కీలక మంతనాలు!!
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మరింత ఫోకస్ చేయనున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటుగా.. బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులతో కీలక మంతనాలు జరపనున్నారు.
![KCR to visit Delhi in may first week likely to meet Opposition leaders over anti-BJP alliance ksm KCR to visit Delhi in may first week likely to meet Opposition leaders over anti-BJP alliance ksm](https://static-ai.asianetnews.com/images/01gm4tx04ae6knfpbasx7e2ftw/kcr-jpg_363x203xt.jpg)
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మరింత ఫోకస్ చేయనున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటుగా.. బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులతో కీలక మంతనాలు జరపనున్నారు. ఆదివారం(ఏప్రిల్ 30) రోజున తెలంగాణ నూతన సచివాలయం భవనం ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. మే 1 లేదా 2వ తేదీన కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఆయన వివిధ విపక్ష పార్టీల నేతలతో సమావేశం కానున్నారు.
ఢిల్లీలో వసంత్ విహార్లోని నిర్మించిన బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని మే 4వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన అనంతరం పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లోని అద్దె భవనంలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయం ఉన్న సంగతి తెలిసిందే. దీనిని గతేడాది డిసెంబర్లో కేసీఆర్ ప్రారంభించారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయం నిర్మాణం పూర్తికావడంతో దానిని ప్రారంభించేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. జాతీయస్థాయి బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడువనున్నాయి.
బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోవత్సరం సందర్భంగా కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమమంలో తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా 200 మంది పార్టీ నేతలు హాజరుకానున్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించనున్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో కేంద్రంలోని అధికార బీజేపీని ఓడించడానికి వ్యూహాలను రూపొందించడానికి వారితో సమావేశం నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ పర్యటన అనంతరం కేసీఆర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరపున ప్రచారం చేసేందుకు రావు బహుశా అక్కడికి వెళ్లే అవకాశం ఉందని పార్టీ అంతర్గత సమాచారం. కేసీఆర్ను జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కర్ణాటకలో తమ పార్టీకి ప్రచారం చేయాల్సిందిగా కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. అయితే కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపాయి.
ఇక, కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ 2020 అక్టోబర్లో జాతీయ రాజధానిలోని వసంత్ విహార్లో 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని పార్టీ శాశ్వత కార్యాలయ నిర్మాణం కోసం టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)కి కేటాయించింది. 2021 సెప్టెంబర్లో భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 20 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.