మేము ఎవరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదు.. చిన్న పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారు?: కేసీఆర్
బీఆర్ఎస్ తెలంగాణకు మాత్రమే పరిమితమైన పార్టీ కాదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తమది రైతుల, పేదల టీమ్ అని చెప్పారు.
బీఆర్ఎస్ తెలంగాణకు మాత్రమే పరిమితమైన పార్టీ కాదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తమది రైతుల, పేదల టీమ్ అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ భారత్లో మార్పు కోసం ప్రయత్నిస్తోందని తెలిపారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని సర్కోలిలో పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తాము ఎవరికీ బీ టీమ్ కాదని తెలిపారు. తాము బీజేపీకి బీ టీమ్ కాదు.. కాంగ్రెస్కు ఏ టీమ్ కాదని చెప్పారు. తాము రైతులు, పేదలు, దళితుల టీమ్ అని స్పష్టం చేశారు.
తాము అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదని ప్రశ్నించారు. పాత విధానాలను బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిందని.. అయినప్పటికీ ఎన్నో సమస్యలు ఉన్నాయని.. వాటిపై ప్రజలు ఆలోచ చేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలతో దేశానికి ఒరిగేదేమీ లేదని అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసిన బీఆర్ఎస్ విస్తరణ కొనసాగుతుందని అన్నారు. తమ చిన్న పార్టీని చూసి బీజేపీ, కాంగ్రెస్లు ఎందుకు ఆందోళన చెందుతున్నాయని ప్రశ్నించారు.
మహారాష్ట్రలో తెలంగాణ అజెండా అమలు చేస్తే తాము వెనక్కివెళ్తామని చెప్పారు. ప్రభుత్వంలో సత్తా ఉంటే ప్రతి ఎకరాకు నీరు అందిచొచ్చని అన్నారు. దేశానికి అవసరమైన బొగ్గు అందుబాటులో ఉందని.. అయినప్పటికీ ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో లబ్ది కోసమే విద్యుత్ ఇవ్వడం లేదని తెలిపారు. తెలంగాణలో రైతులకు ఏటా రూ. 10 వేలు అందిస్తున్నామని చెప్పారు. రైతులకు రూ. 5 లక్షల బీమా ప్రభుత్వమే అందిస్తోందని తెలిపారు.
రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని.. రైతులు ఏకతాటిపైకి వచ్చేవరకు సమస్యలు అలాగే ఉంటాయని చెప్పారు. ఎన్నికల్లో పార్టీలు గెలవడం కాదని.. ప్రజలు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. రైతు ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు.