కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కశ్మీరీ పండిట్ మృతి, సోదరుడికి తీవ్ర గాయాలు..
జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ జిల్లా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో.. ఒక కశ్మీర్ పండిట్ మరణించాడు. మృతుని సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు.
జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ జిల్లా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో.. ఒక కశ్మీర్ పండిట్ మరణించాడు. మృతుని సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ‘‘షోపియాన్లోని చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో ఉగ్రవాదులు పౌరులపై కాల్పులు జరిపారు. ఒకరు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఇద్దరూ మైనారిటీ వర్గానికి చెందినవారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. మరిన్ని వివరాలు పరిశీలించాలి’’ అని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
ఈ ఏడాది మే నెలలో బుద్గామ్లోని ప్రభుత్వ కార్యాలయంలో కాశ్మీరీ పండిట్ హత్యకు గురైన తర్వాత.. ఆ కమ్యూనిటీ నుండి విస్తృత నిరసనలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి లక్షిత దాడులకు భయపడి 5000 మంది కశ్మీరీ పండిట్ ఉద్యోగులు తమ విధులకు హాజరు కావడం లేదు. లోయలో పరిస్థితి చక్కబడే వరకు జమ్మూకు తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇక, గత ఏడాది అక్టోబర్ నుంచి కాశ్మీర్లో వరుస దాడులు జరుగుతున్నాయి. బాధితుల్లో చాలామంది వలస కార్మికులు, కాశ్మీరీ పండిట్లు ఉంటున్నారు. అక్టోబర్లో ఐదు రోజుల్లో ఏడుగురు పౌరులు మరణించారు. వారిలో ఒక కాశ్మీరీ పండిట్, ఒక సిక్కు, ఇద్దరు వలస హిందువులు ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతకాలం తర్వాత అనేక కాశ్మీరీ పండిట్ కుటుంబాలు లోయలోని తమ ఇళ్లను వదిలి పారిపోయాయి.