బడ్జెట్ సమావేశాలు..చొక్కా విప్పి రచ్చ చేసిన ఎమ్మెల్యే
ఆర్టికల్ 363 ప్రకారం ఉన్న విశేషాధికారాలతో చర్చకు ఆహ్వానించినట్లు సభాపతి తెలిపారు. విపక్ష సభ్యులు సభాపతి పోడియం చుట్టుముట్టారు.
కర్ణాటక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ఏర్పడింది. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవ్వగా... తొలి రోజే ఓ ఎమ్మెల్యే రచ్చ చేశాడు.
విధానసభలో ఒక దేశం– ఒక ఎన్నికపై చర్చించాలని సభాపతి విశ్వేశ్వరహెగడే కాగేరి సూచించారు దీనిపై కాంగ్రెస్ పక్ష నేత సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరికీ చెప్పకుండా చర్చకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఆర్టికల్ 363 ప్రకారం ఉన్న విశేషాధికారాలతో చర్చకు ఆహ్వానించినట్లు సభాపతి తెలిపారు. విపక్ష సభ్యులు సభాపతి పోడియం చుట్టుముట్టారు. చర్చిస్తే తప్పేముందని బీజేపీ సభ్యులు వాదించారు. ఇరువర్గాల అరుపులతో గందరగోళం నెలకొంది.
భద్రావతి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంగమేశ్ సభాపతి పోడియం ముందుకు వచ్చి చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేయడం కలకలం రేపింది. అసభ్యంగా ప్రవర్తించారని ఆయనను సభాపతి సస్పెండ్ చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంగమేశ్కు షర్టు వేశారు. ఈ ఘటనతో 10 నిమిషాల పాటు స్పీకర్ సభను వాయిదా వేశారు. మళ్లీ సభ మొదలుకాగా మాజీ స్పీకర్ రమేశ్కుమార్ –స్పీకర్ కాగేరి మధ్య సభాపతి ప్రత్యేక అధికారాలపై తీవ్ర చర్చ సాగింది. ఇక సెక్స్స్కాండల్లో ఇరుక్కుని మంత్రి పదవిని కోల్పోయిన రమేశ్ జార్కిహొళి సభకు గైర్హాజరయ్యారు. ఆయన సోదర ఎమ్మెల్యేలూ ముఖం చాటేశారు