ఇప్పటికే ఏపీ- తెలంగాణ జలవివాదం: కొత్తగా కర్ణాటక- తమిళనాడు మధ్య కాకరేపుతోన్న ‘‘ కావేరి ’’ ఇష్యూ
ప్రస్తుతం ఏపీ- తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వ్యవహారం ఏ స్థాయిలో వుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ అక్రమ ప్రాజెక్ట్లు నిర్మిస్తోందని తెలంగాణ.. కేటాయింపులకు విరుద్ధంగా తెలంగాణ నీటిని వినియోగిస్తోందని ఏపీ నిత్యం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి
ప్రస్తుతం ఏపీ- తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వ్యవహారం ఏ స్థాయిలో వుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ అక్రమ ప్రాజెక్ట్లు నిర్మిస్తోందని తెలంగాణ.. కేటాయింపులకు విరుద్ధంగా తెలంగాణ నీటిని వినియోగిస్తోందని ఏపీ నిత్యం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. దీనికి తోడు ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగితే కానీ పరిస్ధితులు కుదట పడవని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలావుండగానే కావేరి జలాలపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కర్ణాటక ప్రభుత్వం కావేరి నదిపై మేకెదాటు ప్రాజెక్టును నిర్మించతలపెట్టింది. దీనిపై కర్ణాటక సీఎం యడియూరప్ప తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు.
Also Read:జల వివాదం సివిల్ వార్కు దారితీసే ఛాన్స్: బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్
తాము దీనిపై ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్కు లేఖ రాసినప్పటికీ, దీనికి అటు నుంచి స్పందన రాలేదని యడియూరప్ప చెప్పారు. తాము ఏదేమైనప్పటికీ ప్రాజెక్టును కొనసాగిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మేకెదాటు పథకంతో కర్ణాటకకే కాకుండా తమిళనాడు రాష్ట్రానికి కూడా లబ్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. తాము చట్టబద్ధంగానే ప్రాజెక్ట్ను నిర్మిస్తామని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని యడియూరప్ప వ్యాఖ్యానించారు.