కర్ణాటక క్రైసిస్: అధికారాన్ని లాక్కొనేందుకు కుట్ర: కుమారస్వామి
కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ ప్రతిపాదించిన అవిశ్వాసంపై గురువారం నాడు చర్చ ప్రారంభమైంది. చర్చను సీఎం కుమారస్వామి ప్రారంభిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
బెంగుళూరు: రాష్ట్రంలో అధికారాన్ని లాక్కొనేందుకు కుట్ర జరిగిందని కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేల సహకారంతోనే రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆయన చెప్పారు.
కర్ణాటక ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష సందర్భంగా గురువారం నాడు అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు దూరంగా ఉండాలని బీఎస్పీ నిర్ణయం తీసుకొంది. కర్ణాటక క్రైసిస్ నేపథ్యంలో విశ్వాస పరీక్షకు తాను సిద్దమని ఇదివరకే సీఎం కుమారస్వామి ప్రకటించారు.
మరో వైపు ప్రభుత్వంపై బీజేపీ సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానంపై చర్చను గురువారం నాడు సీఎం కుమారస్వామి ప్రారంభించారు.తాను బలనిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయనే విషయమై చర్చ జరగాలన్నారు. బలనిరూపణ వెనుక బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఉందని ఆయన విమర్శలు గుప్పించారు.