కర్ణాటకలో దారుణం: గేట్ ఆలస్యంగా తీశారని టోల్ సిబ్బందిపై దాడి, ఒకరు మృతి
కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. టోల్ గేట్ తీయడంలో ఆలస్యమైందని నలుగురు వ్యక్తులు టోల్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో టోల్ ప్లాజాలో పనిచేసే పవన్ అనే వ్యక్తి మృతి చెందాడు.
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఆదివారంనాడు రాత్రి దారుణం చోటు చేసుకుంది. టోల్ గేట్ తీయడంలో ఆలస్యం చేశారని టోల్ సిబ్బందిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో టోల్ ప్లాజా లో పనిచేసే ఓ ఉద్యోగి మృతి చెందాడు. మృతి చెందిన ఉద్యోగిని పవన్ కుమార్ గా గుర్తించారు. మృతుడి వయస్సు 26.
బెంగుళూరుకు 35 కి.మీ దూరంలోని రామనగరలోని బిడది టోల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు. నిందితులు బెంగుళూరుకు చెందిన వారిగా గుర్తించినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఆదివారం నాడు రాత్రి 10 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు కారులో మైసూరు వెళ్తున్నారు. ఈ కారు టోల్ ప్లాజా వద్దకు వచ్చిన సమయంలో టోల్ ప్లాజా బారియర్ ఎత్తడంలో టోల్ ప్లాజ్ సిబ్బంది జాప్యం చేశారని కారులోని నలుగురు వ్యక్తులు టోల్ సిబ్బందితో గొడవకు దిగారు.
అయితే స్థానికులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. దీంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. టోల్ ప్లాజా కు కొద్దిదూరంలో కారులో నలుగురు నిందితులు వేచి ఉన్నారు. భోజనం కోసం ఆదివారంనాడు రాత్రి 12 గంటల సమయంలో పవన్ కుమార్ అతని సహోద్యోగి టోల్ ప్లాజా నుండి బయటకు రాగానే నిందితులు హాకీ స్టిక్స్ తో దాడికి దిగి పారిపోయారు. ఈ దాడిలో పవన్ కుమార్ మృతి చెందాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.