కర్నాటక శివమొగ్గలో టెన్షన్ టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
Shivamogga: ఇద్దరు వ్యక్తులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో కర్ణాటకలోని శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గట్టి చర్యలు తీసుకుంటున్న పోలీసులు.. పరిస్థితి అదుపులోనే ఉందనీ, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని శివమొగ్గ ఎస్పీ జీకే మిథున్ కుమార్ తెలిపారు.
Karnataka: కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొన్నది. శివమొగ్గ జిల్లాలో సోమవారం రాత్రి వేర్వేరు ఘటనల్లో ఇద్దరిపై దాడి జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. దాడి చేసినవారు ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారనీ, హిందుత్వ కార్యకర్తలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని బాధితుల్లో ఒకరైన ప్రకాశ్ పేర్కొన్నారు. ఈ దాడిలో ప్రకాష్కు స్వల్ప గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. “ఇద్దరు వ్యక్తులు నన్ను కొట్టడం ప్రారంభించారు. ఆపై రాళ్లు, ఇతర వస్తువులతో కొట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నన్ను తన్నాడు. వారు ఆర్ఎస్ఎస్, సంబంధిత కార్యకర్తలపై కొన్ని అవమానకరమైన పదాలను ఉపయోగించారు..” అని పీటీఐ నివేదించింది.
"నేను నేలమీద పడ్డాను.. అయినప్పటికీ నాపై దాడి చేసారు. కానీ ఎలాగో నేను లేచి, వారు నా ముఖం మీద కొట్టారు. ఆ తర్వాత తలపై కొట్టడంతో రక్తం కారడం మొదలైంది. వారి నుంచి తప్పించుకుని నేను సమీపంలోని నా ఇంటి వైపు పరిగెత్తాను.. అయినప్పటికీ వదలకుండా వారు వెంటాడి వచ్చి నాపై దాడి చేశారు" అని చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత ఘటనలపై విచారణ కొనసాగుతున్నదని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందనీ, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని శివమొగ్గ ఎస్పీ జీకే మిథున్ కుమార్ హామీ ఇచ్చారు. దొడ్డపేట పీఎస్లో మార్కెట్ ఫౌజాన్, అజర్ అలియాస్ అజ్జు, ఫరాజ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన మార్కెట్ ఫౌజాన్, అజహర్, ఫరాజ్లు ఒక్కొక్కరు మూడు నుండి ఐదు కేసులు ఎదుర్కొంటున్నారని మిథున్ మంగళవారం సాయంత్రం చెప్పారు. ఐదుగురు యువకులు మతపరమైన సున్నితమైన శివమొగ్గలోని సీగేహట్టికి రాత్రి 11 గంటల సమయంలో రెండు బైక్లపై వెళ్లి ఒక వ్యక్తిని దూషించడంతో పాటు దాడికి పాల్పడ్డారు. అనంతరం భరమప్ప నగర్కు వెళ్లి ప్రకాష్పై దుర్భాషలాడారు. ఈ క్రమంలోనే ఘర్షణ చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం మార్కెట్ ఫౌజాన్గా గుర్తించబడిన దాడికి పాల్పడిన వారిలో ఒకరిపై బాధితులు వ్యాఖ్యలు చేయడంతో దాడికి కారణం ప్రతీకారం అని మిథున్ కుమార్ చెప్పారు. కర్నాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నానీ, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
కాగా, ఈ దాడికి పాల్పడిన దుండగులు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోతుండగా, ఈ ఏడాది ప్రారంభంలో హత్యకు గురైన హిందుత్వ కార్యకర్త హర్ష కుటుంబ సభ్యులను బెదిరించారు. ప్రకాష్పై దాడి చేసి పారిపోతున్న ముగ్గురు తనపై, తన తల్లిపై దాడి చేస్తామని బెదిరించారని హర్ష సోదరి అశ్విని మీడియాకు తెలిపారు. హర్ష కుటుంబ సభ్యులతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడారు. “నేను కుటుంబానికి భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చాను. ఒక్క కుటుంబం మాత్రమే కాదు, శివమొగ్గ నివాసులందరి భద్రత కోసం మేము ఇక్కడ ఉన్నాము. చెక్పోస్టులు ఏర్పాటు చేసి అదనపు బలగాలను మోహరిస్తాం’’ అని చెప్పారు.