Karnataka Rains: కర్నాటకలో భారీ వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేస్తూ సీఎం ఆదేశాలు
Karnataka rains: దక్షిణ కన్నడ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా మంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కాంపౌండ్ వాల్ కూలింది. ఆగి ఉన్న మూడు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
heavy rains in Karnataka: కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని తీరప్రాంతాలు, మల్నాడు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ముంపుప్రాంత భాదితుల కోసం సమాయక చర్యలు తీసుకోవాలనీ, తక్షణమే క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో, సహాయక చర్యలను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టామని, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు సీఎం వెల్లడించారు. వర్షాల వల్ల ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పెద్దఎత్తున ఆస్తులకు నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో రాష్ట్రంలో నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
దక్షిణ కన్నడ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా మంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కాంపౌండ్ వాల్ కూలింది. ఆగి ఉన్న మూడు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ఈ ఘటన జరిగినప్పుడు కొత్త విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ జరుగుతోంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. "నేను వర్ష ప్రభావిత జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో ప్రస్తుత వర్షాలు, వరద పరిస్థితులపై చర్చించాను. ఇప్పటికే రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించాను. భారీ వర్షాలు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా కోస్తా జిల్లాలు, కొడగులో ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయి. ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి" అని బొమ్మై చెప్పారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్లను మోహరించాలని ఆదేశించినట్టు తెలిపారు.
ఇదిలావుండగా, హుబ్బలిలో జరిగిన వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్యను రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ఆందోళనకరంగా మార్చిన పరిస్థితులపై బొమ్మై స్పందిస్తూ.. “ఇది శాంతిభద్రతలకు సంబంధించిన అంశం కాదు, సమాజంలో పెరుగుతున్న వ్యక్తిగత ఉల్లాస లేదా శత్రుత్వానికి సంబంధించిన సమస్యలకు సంబంధించినవి. మనమందరం కలిసి అటువంటి మనస్తత్వాన్ని అణచివేయాలి. చట్టాలను బలోపేతం చేయడంతో పాటు ఇలాంటి విషయాలను సరిదిద్దాలి" అని అన్నారు. మంగళవారం హుబ్బలిలోని ఓ హోటల్ రిసెప్షన్ లాంజ్లో చంద్రశేఖర్ గురూజీని కత్తితో పొడిచి చంపారు.
ఐఎండీ హెచ్చరికలు..
భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న రాష్ట్రానికి ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఉడిపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాల్లో జిల్లా యంత్రాంగం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా అన్మోద్ ఘాట్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. కలస, హొరనాడు మధ్య ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. అనేక వంతెనలు మునిగిపోయాయి. మంగళూరు పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. దక్షిణ కన్నడలో ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, చెట్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు నదులు ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తున్నాయి. నది ఒడ్డున నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.