ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కర్ణాటకలో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఆయన మొదటి ర్యాలీ బీదర్లోని హుమ్నాబాద్లో నిర్వహించారు. అక్కడ ఆయన ప్రసంగం వినడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరు సాగుతోంది. ఇప్పటికే అధికార బీజేపీ.. తన జాతీయ నేతలను ప్రచారం సాగిస్తూ దూకుడు పెంచింది. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే రంగంలోకి దిగారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో హీట్ మరింత పెరిగింది. కాంగ్రెస్ పార్టీ తనను 91 సార్లు దూషించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. అలా చేసిన ప్రతీసారి ఆ పార్టీ పరాజయం పాలైందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటక పూర్తిగా నష్టపోయిందని చెప్పుకొచ్చారు.
కర్ణాటకలో బీదర్ జిల్లాలోని హమ్నాబాద్లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బీదర్ నుండి ప్రారంభించడం తన అదృష్టమనీ, ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిని అయినప్పుడు కూడా బీదర్ ప్రజల ఆశీర్వాదం పొందానని అన్నారు. అందుకే తాను బీదర్ నుండి ప్రచారం ప్రారంభించాననీ, పెద్ద సంఖ్యలో ప్రజలు తనను ఆశీర్వాదించడానికి రావడం చాలా సంతోషంగా ఉండన్నారు. కర్నాటకలో జరిగే ఈ ఎన్నికలు ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే కాదు, కర్ణాటకను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చే ఎన్నికలని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటకలోని ప్రతి మూల అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
' నాపై కాంగ్రెస్ దుర్భాషలాడుతోంది'
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తనపై విష ప్రచారం చేస్తున్నారనీ, కాంగ్రెస్ తనను “91 సార్లు” దూషించిందని అన్నారు. తాను సామాన్యుల గురించి మాట్లాడితే.. వారి స్వార్థ రాజకీయాలతో తనపై దాడి చేస్తున్నారనీ, ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మళ్లీ తనని తిట్టిందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ వాళ్లు 91 సార్లు దుర్భాషలాడారని , ఈ దూషణలతో కాలక్షేపం చేసే బదులు కాంగ్రెస్ సుపరిపాలనలో ఇంత కష్టపడి ఉంటే వారి పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేది కాదని విమర్శించారు. వారు లింగాయత్ వర్గాన్ని నిందించారని, అంబేడ్కర్,వీర్ సావర్కర్ను అవమానించారని, వారి నిందలకు ప్రజలు ఓట్లతో తప్పకుండా బదులిస్తారని ప్రధాని మోదీ అన్నారు.
కర్ణాటక రైతులు, ప్రజలకు కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలను తిప్పికొట్టాలని, కాంగ్రెస్ హయాంతో పోలిస్తే.. తమ హయాంలో విదేశీ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ అధికారంలో కర్ణాటకలో రెట్టింపు వేగంతో అభివృద్ధి జరుగుతోందన్నారు ప్రధాని. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే.. రెండింతల వేగంతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకపోతుందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదలకు ఇళ్ల నిర్మాణంలో వేగం తగ్గించిందనీ, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 9 లక్షల పక్కా ఇండ్లను నిర్మించాలని నిర్ణయించామనీ, కేవలం బీదర్లో దాదాపు 30,000 ఇళ్లను నిర్మించామనీ. అంటే.. బీదర్లో 30 వేల మంది సోదరీమణలు లక్షాధికారులయ్యారని అన్నారు.
కర్నాటకను దేశంలోనే నంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే .. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమనీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్ణాటకకు ఏటా దాదాపు రూ.30 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చేవని, బీజేపీ ప్రభుత్వ హయాంలో కర్ణాటకకు ఏటా దాదాపు రూ.90 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటే - డబుల్ ప్రయోజనం, రెట్టింపు వేగమని అన్నారు.
