కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షాపై కాంగ్రెస్ నేతలు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా చేసిన ప్రసంగంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బెంగళూరు: కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షాపై కాంగ్రెస్ నేతలు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు రణదీప్సింగ్ సూర్జేవాలా, పరమేశ్వర్, డీకే శివకుమార్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో అమిత్ షా, బీజేపీ ర్యాలీ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. అమిత్ షా.. రెచ్చగొట్టే ప్రకటనలు, శత్రుత్వం, ద్వేషం, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మతపరమైన అల్లర్లు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ చెప్పారు. అయితే ఈ మాటలను అమిత్ షా ఇలా ఎలా చెప్పగలరని ప్రశ్నించారు.
Also Read: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదు.. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో వస్తే అల్లర్లు: అమిత్ షా
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే కర్ణాటక అల్లర్లతో అల్లాడిపోతుందని బెళగావిలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా కామెంట్ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది “నర్మగర్భమైన బెదిరింపు ప్రకటన” అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ముందు లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ బుధవారం తెలిపింది.
