Karnataka Launches Kashi Yatra Scheme:కర్నాటకలోని బీజేపీ పాలిత‌ ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. తీర్థ‌యాత్ర‌లు చేయాల‌నుకునే.. వారికోసం ‘‘కాశీ యాత్ర’’ అనే పథకాన్ని ఆ రాష్ట్ర  సీఎం బసవరాజ్​ బొమ్మై ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు 

Karnataka Launches Kashi Yatra Scheme: కర్నాటకలోని బీజేపీ స‌ర్కార్ రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓ సరికొత్త పథకానికి శ్రీ‌కారం చుట్టింది. హిందూ తీర్థ‌యాత్రికుల స‌హాయం అందించ‌డానికి ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ‘‘కాశీ యాత్ర’’ పేరిట నూత‌న ప‌థ‌కాన్ని రూపొందించింది. ఈ ప‌థకాన్ని ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్​ బొమ్మై సోమ‌వారం ప్రారంభించారు. దీని కోసం.. క‌ర్నాట‌క‌ రాష్ట్ర ప్ర‌భుత్వం తమ బడ్జెట్​లో రూ. 7 కోట్లను కేటాయించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి తీర్థయాత్ర చేయడానికి సిద్దంగా ఉన్న 30వేల మంది యాత్రికులకు ఒక్కొక్కరికి 5వేల రూపాయల నగదు సహాయం అందించనున్నట్టు సీఎం బొమ్మై పేర్కొన్నారు. మానస సరోవర యాత్రికులకు సహాయం అనే అకౌంట్స్ హెడ్‌ కింద ‘కాశీ యాత్ర’ కోసం మంజూరైన రూ. 7 కోట్లను వినియోగించుకునేందుకు మతపరమైన దేవాదాయ శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం తన ఉత్తర్వులో ఈ అధికారం ఇచ్చింది. 

ఈ పథకం ద్వారా ప్రయోజనాలనుకునే వారు.. కర్నాటక నివాసి అయి ఉండి, కర్ణాటకలో నివాసం ఉన్నట్లు రుజువు కలిగి ఉండాలని, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదా రేషన్‌కార్డు తదితర వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. కాగా, మతపరమైన దానం, హజ్, వక్ఫ్ మంత్రి శశికళ జోల్లె దీనికి సంబంధించి ఇవ్వాల ఈ ప్రకటన జారీచేశారు. 2022-23 క‌ర్నాట‌క‌ రాష్ట్ర‌ బడ్జెట్‌లో కాశీ యాత్రకు రూ. 5,000 సబ్సిడీ అందించ‌నున్న‌ట్టు ఆ రాష్ట్ర‌ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. కాశీకి వెళ్లాలనుకునే, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారి కోసం కాశీ ప్రయాణ సబ్సిడీ పథకం ప్రయోజన‌క‌రంగా ఉంటుందని తెలిపారు. 

ప్రయోజనం ఎవరు పొందవచ్చు?

ఈ ప‌థ‌కం కింద్ర ఆప్లై చేసుకున్న దరఖాస్తుదారులు 18 ఏళ్లు నిండి ఉండాలి. వారు తప్పనిసరిగా వయస్సు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు తీర్థయాత్ర చేపట్టిన యాత్రికులకు ఈ ప్రయోజనం దక్కుతుంది. కాశీ యాత్ర ప‌థ‌కాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకునే వారు తమ దర్శన టిక్కెట్టు లేదా వెయిటింగ్ లిస్ట్, కాశీ విశ్వనాథ దర్శనానికి వెళ్లినట్లు 'పూజ రశీదు' వంటి రుజువులను సమర్పించాల్సి ఉంటుంది. ఆ రిసీప్ట్​ని తగిన ప్రొఫార్మాలో రిలీజియస్ ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ కమిషనర్‌కు సమర్పించాలి. ప్రభుత్వం నిర్వహించే కాశీ యాత్ర ద్వారా యాత్రికులు జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రయోజనం పొందగలరని జోలె తెలిపారు.