కర్నాటకలో హిజాబ్ వివాదం వల్ల ఈ నెల 16వ తేదీ వరకు కాలేజీలు మూసివేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు స్కూళ్లు వచ్చే సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. అయితే తుది తీర్పు వచ్చేంత వరకు స్కూళ్లలో ఎలాంటి మతపరమైన దుస్తులు వేసుకోకూడదని తెలిపింది.
కర్నాటకలో హిజాబ్ (hijab) వివాదం రోజు రోజుకు ముదిరిపోతోంది. ఈ వివాదం వల్ల విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే 4 రోజులు విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన కర్నాటక ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణను కొనసాగిస్తున్నందున ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కాలేజీలు మూసివేసి ఉంచుతామని కర్ణాటక (karnataka) ప్రభుత్వం ప్రకటించింది.
‘‘ డిపార్ట్మెంట్ ఆఫ్ కాలేజియేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (DCTE) పరిధిలోని ఉన్నత విద్యా శాఖకు చెందిన విశ్వవిద్యాలయాలు, కాలేజీలు ఫిబ్రవరి 16 వరకు మూసివేయబడతాయి. అప్పటి వరకు ఆన్ లైన్ క్లాసులు కొనసాగించాలని సంస్థలకు ఆదేశాలు ఇస్తున్నాం’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే 11, 12 తరగతులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా విద్యార్థులు ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించరాదని హైకోర్టు (high court) మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో 1-10 తరగతుల పాఠశాలలు ఫిబ్రవరి 14వ తేదీ (సోమవారం) నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి. కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు (డీసీలు), పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీలు), పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీపీఐలు), జిల్లా పంచాయతీల సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రలో ఉన్న పరిస్థితిని సమీక్షించారు.
హిజాబ్ వివాదానికి సంబంధించిన అన్ని పిటిషన్ల పరిశీలన పెండింగ్లో ఉన్నందున్న హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులో విద్యాసంస్థలను తిరిగి తెరవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. తరగతి గదిలో విద్యార్థులందరూ కాషాయ కండువాలు, హిజాబ్, ఎలాంటి మతపరమైన జెండాను ధరించరాదని ఆదేశించింది. శాంతిభద్రతలను అన్నివిధాలా కాపాడాలని, బయటి నుంచి ఎలాంటి ప్రేరేపణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి వారి నిర్దేశిత ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. కాగా హిజాబ్ అనుకూల వ్యతిరేక నిరసనలకు కేంద్రంగా ఉన్న ఉడిపి (udipi)లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. శాంతిభద్రతలు అదుపులోకి రావడంతో భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి.
గత నెలలో ఉడిపి (udipi)లోని ప్రభుత్వ కాలేజీలో ఈ వివాదం ప్రారంభమైంది. ఆరుగురు విద్యార్థినీలు నిర్దేశించిన దుస్తుల కోడ్ను ఉల్లంఘించి హిజాబ్లు ధరించి తరగతులకు వచ్చారు. తర్వాత నగరంలోని కుందాపూర్ (kundapur), బిందూర్ (bindur)లలో సమీపంలోని కాలేజీల్లో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఆంశానికి వ్యతిరేకంగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కాలేజీలకు వచ్చారు. తాము కండువా ధరించి వస్తామనీ తెలిపారు. కానీ వ్యతిరేకించడంతో తమను తరగతుల నుండి నిషేధించారని ఆరోపించడంతో హిజాబ్ నిరసనలు ప్రారంభించారు. ఉడిపి, చిక్కమగళూరులోని రైట్వింగ్ గ్రూపులు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించాయి. ఈ నిరసనలు ఉడిపిలో ఉన్న మరిన్ని కాలేజీలకు వ్యాపించాయి. ఈ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇది కర్నాటక సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి (puducherry)లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
