ఉబర్, ఓలా, ర్యాపిడో సర్వీసుల నిలిపివేత.. ఆదేశాలను ఉల్లంఘిస్తే.. ‘భరత్ అనే నేను’ రేంజ్లో..!
బెంగళూరులో ఉబర్, ఓలా, ర్యాపిడో క్యాబ్ లు, ఆటో సర్వీసులు పూర్తిగా నిలిపివేయాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఉల్లంఘిస్తే.. ఒక్కో వాహనానికి రూ. 5,000 వరకు జరిమాన విధిస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని నగరం, ఐటీ సీటీ బెంగళూరులో ఉబర్, ఓలా, ర్యాపిడో క్యాబ్ లు, ఆటో సర్వీసులు పూర్తిగా నిలిపివేయాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. బుధవారం(అక్టోబర్ 12) నుంచి రైడ్-హెయిలింగ్ యాప్ ఉబర్, ర్యాపిడో, ఓలా సర్వీసులు నడిపితే.. చర్చలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆ శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఓలా, ర్యాపిడో, ఉబర్ లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని చాలా మంది ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో.. నిబంధనలను ఉల్లంఘించారని, ఈ కారణంగా సామాన్య ప్రజలు, డ్రైవర్లు కూడా నష్టపోతున్నారని పేర్కొంటూ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మరో వైపు రవాణా శాఖ అధికారులు క్యాబ్ లు, ఆటోలు సీజ్ చేస్తున్నారు.
కర్షాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో ఓలా, ఉబర్, ర్యాపిడో క్యాబ్, ఆటో డ్రైవర్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంలో ఉబర్, ర్యాపిడో, ఓలా సర్వీసులు ఏం చెయ్యాలో అర్థం కాక ఆ సంస్థల యాజమాన్యం హడలిపోయింది.
బెంగళూరులో రెండు లక్షల ఆటోరిక్షాలు
రాష్ట్ర రాజధాని బెంగళూరులో సుమారు 2 లక్షల ఆటోరిక్షాలు ఉన్నాయని అంచనా వేయబడింది, వీటిలో సుమారు 1 లక్ష ఆటోరిక్షాలు అగ్రిగేటర్ల ద్వారా నడిచాయి. బెంగళూరులో లక్షలాది మంది ప్రజలు యాప్లపై ఆధారపడి ఉన్నారు. ఇటీవలి కాలంలో అధిక ఛార్జీలు. ఆదాయం పడిపోవడంతో ప్రయాణికులు, డ్రైవర్లు అగ్రిగేటర్లతో కలత చెందారు.
కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
ఇదిలావుండగా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. సరైన లైసెన్స్ లేకుండా బెంగళూరులో ఆటో-రిక్షా రైడ్లను ఆఫర్ చేస్తున్న యాప్ ఆధారిత కంపెనీలు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను ఆదేశించారు. ఓలా, ఉబర్, రాపిడో తమ ప్లాట్ఫారమ్లలో బుక్ చేసుకున్న ఆటో-రిక్షా రైడ్లపై కస్టమర్లకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని నివేదికలు వెలువడిన తర్వాత ఆయన వ్యాఖ్యానించారు.
బెంగళూరుతో సహ కర్ణాటక మొత్తం ఆటో డ్రైవర్లు రెండు కిలోమీటర్ల వరకు కనీసం రూ. 30 వసూలు చెయ్యాల్సి ఉంది. ఈ నియమనిబంధనలు కర్ణాటక ప్రభుత్వ రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. కానీ.. ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో డ్రైవర్లు మినిమమ్ చార్జీ గా రూ. 70 నుంచి రూ. 100 వరకు ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదులు చెయ్యడంతో ఈ వివాదం ప్రారంభమైంది. మినిమమ్ చార్జ్ రూ. 30 కంటే అధిక మొత్తంలో డబ్బులు వసూలు చెయ్యకూడదని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఒక్కో వాహనంకు రూ. 5 వేలు జరిమానా
రాష్ట్రప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి.. ఉబర్, ఓలా, ర్యాపిడో య్యాప్ లతో ఆటోలు, క్యాబ్ లు నడిపితే ఒక్కో వాహనానికి రూ. 5,000 వరకు జరిమాన విధిస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఆదేశాలు బుధవారం నుంచి అమలుల్లోకి వస్తాయనీ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చర్చలు విఫలం
ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలతో మంగళవారం కర్ణాటక రవాణా శాఖా ప్రధాన కార్యదర్శి కుమార్, సంబంధిత అధికారులు చర్చలు జరిపారు. అయితే.. ఆ చర్చలు విఫలం కావడంతో బుధవారం నుంచి ఉబర్, ఓలా, ర్యాపిడో సర్వీసులు నిలిపివేయాలని రవాణా శాఖ నిర్ణయించింది.