కూతురు దళిత వ్యక్తితో పారిపోయిందనే అనుమానంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య
Bengaluru: తన కుమార్తె అర్చన (28) కనిపించకుండా పోయిందని శ్రీరామప్ప సోమవారం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమె షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడితో కలిసి పారిపోయిందని కుటుంబ సభ్యులు అనుమానించడం ప్రారంభించారు.
Chikkaballapur: కూతురు దళిత వ్యక్తితో కలిసి పారిపోయిందనే అనుమానంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య, కుమారుడితో సహా.. తన కుమార్తె వేరే కులానికి చెందిన వ్యక్తితో పారిపోయిందనే అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
మృతులు సిడ్లఘట్ట తాలూకా హండిగానాల గ్రామానికి చెందిన శ్రీరామప్ప (69), అతని భార్య సరోజ (55), మనోజ్ (25)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తె అర్చన (28) కనిపించకుండా పోయిందని శ్రీరామప్ప సోమవారం ఫిర్యాదు చేశారు. తర్వతి రోజు వొక్కలిగ కులానికి చెందిన కుటుంబ సభ్యులు, ఆమె షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడితో పారిపోయిందని అనుమానించడం ప్రారంభించారు. దీంతో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని స్థానికులు పేర్కొంటున్నారు.
ఆ యువతి గత మూడేళ్లుగా యువకుడితో సంబంధం కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆ అమ్మాయి ఎక్కడ ఉందనే వివరాలను పోలీసులు గుర్తించలేకపోయారు. తమ పెళ్లికి కుటుంబీకుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ఇద్దరూ పారిపోయి ఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. స్పాట్ నుండి స్వాధీనం చేసుకున్న నోట్లో, వారి మరణానికి అర్చన కారణమని కుటుంబం ఆరోపించింది.
బెంగళూరులో మరో ఘటన..
బెంగళూరులో 17 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాలలో కులపరమైన వేధింపులే కారణమని కుటుంబం ఆరోపించింది. పాఠశాల అధికారులు బాలుడిని మానసికంగా, శారీరకంగా వేధించారనే కుటుంబ సభ్యుల ఆరోపణ ఆధారంగా పాఠశాలపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. బెంగళూరు పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులకు గురైన శ్రేయాస్ అనే 17 ఏళ్ల దళిత బాలుడు సెప్టెంబర్ 27న ఉల్లాల్ ఉపనగరలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రేయాస్ తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో ఇరుగుపొరుగు వారి ద్వారా మృతదేహాన్ని గుర్తించారు. మరుసటి రోజు వరకు 10వ తరగతి విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ తల్లిదండ్రులకు లభించలేదు.
అధికారులు బాలుడిని కొట్టి, కుల దూషణలకు గురిచేసి మానసికంగా, శారీరకంగా వేధించారని కుటుంబీకుల ఆరోపణ ఆధారంగా పాఠశాలపై కేసు నమోదు చేశారు. బెంగళూరు వెస్ట్లోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ 2015 జువైనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్, 2015లోని సెక్షన్ 75 కింద సెయింట్ ప్యాట్రిక్ మెమోరియల్ హైస్కూల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. వేధింపుల గురించి శ్రేయాస్ తండ్రి మార హనుమయ్య మాట్లాడుతూ "ఉపాధ్యాయులు నన్ను ఒక రోజు పాఠశాలకు రమ్మని అడిగారు. నేను వెళ్ళినప్పుడు అతను బాగా చదవడం లేదని ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత, వారు నా కొడుకును కొట్టినట్లు నేను చూశాను. అతడి నోరు, ముక్కు నుంచి రక్తం కారుతోంది. నా కొడుకు కింద పడి గాయపడ్డాడని స్కూల్లో చెప్పగా, దిలీప్ అనే మ్యాథ్స్ టీచర్ అతడిని దూషించాడని తెలిసింది. నా కొడుకు 10వ తరగతి చదువుతున్నందున నేను పోలీసులను ఆశ్రయించడానికి సంకోచించాను. అతను ప్రస్తుతానికి చదువు మానేయడానికి ఇది కారణం కాదనుకున్నాను" అని చెప్పినట్టు ది న్యూస్ మినట్ నివేదించింది.
మొదట వేధింపుల అనంతరం హనుమయ్య పాఠశాల యాజమాన్యాన్ని ఆశ్రయించి సమస్యను వారితో ప్రస్తావించాడు. ఇకపై అలాంటిదేమీ జరగదని హామీ ఇవ్వగా, హనుమయ్య విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆగ్రహంతో ఆ తర్వాత కూడా తన కుమారుడిని లెక్కల ఉపాధ్యాయుడు దుర్భాషలాడాడని ఆరోపించారు.