కర్ణాటక ప్రజలు బీజేపీతో విసిగిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలో మోదీ వచ్చిన ఏం చేయలేరని తాము గతంలోనే చెప్పామని తెలిపారు.
బెంగళూరు: కర్ణాటక ప్రజలు బీజేపీతో విసిగిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలో మోదీ వచ్చిన ఏం చేయలేరని తాము గతంలోనే చెప్పామని తెలిపారు. కర్ణాటకలో మత రాజకీయాలు పనిచేయలేదని బీజేపీపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు ఎవరితో పొత్తు అవసరం లేదని చెప్పారు. తమ పార్టీ 120కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. తాము ఊహించిన విధంగానే మెజారిటీ సాధించబోతున్నామని చెప్పారు.
ఇదిలా ఉంటే.. కర్ణాటకలో 120కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్లో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. అక్కడ స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు. ‘‘కాంగ్రెస్ ఓటమి నుండి గుణపాఠం నేర్చుకుని నేడు విజయం వైపు పయనిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను’’ అని కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా అన్నారు.
మరోవైపు బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. ఆఫీసు వద్ద బాణసంచా కాల్చుతున్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు మాత్రం ఫలితాలపై సరళిపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత.. దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడికి చేరుకుంటారని సమాచారం.
