కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు కనబడుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు కనబడుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని యతీంద్ర ధీమా వ్యక్తం చేశారు. అందువల్ల తమకు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే చాన్స్ ఉండకపోవచ్చని అన్నారు. ఒకవేళ తమకు మెజారిటీ రాని పక్షంలో ఏం చేయాలనే దానిపై ఢిల్లీలోని పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు.
ఒకవేళ మెజారిటీ రాకపోతే తమ నాయకులు ఏ విధమైన వ్యుహంతో ముందుకు వెళ్తారనే దానిపై తనకు సమాచారం లేదని తెలిపారు. తమ నాయకులు ఏ నిర్ణయం తీసుకున్న దానిని తాము పాటిస్తామని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రయోజనం కోసం బీజేపీని అధికారంలోకి రాకుండా ఏదైనా చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన తండ్రి సిద్దరామయ్య సీఎం కావాలని అన్నారు.
ఇక, కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో.. ఫలితం ఏ విధంగా వస్తుందనేదానిపై బీజేపీ, కాంగ్రెస్తో పాటు జేడీఎస్ వర్గాల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో.. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక, మే 10న జరిగిన ఓటింగ్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
