కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 100కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థులు 70కి పైగా స్థానాల్లో ముందజలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా.. గెలిచిన అభ్యర్థులను ఈరోజు బెంగళూరు చేరుకోవాల్సిందిగా కాంగ్రెస్ నాయకత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది.
అదే విధంగా రాష్ట్రంలోని రిమోట్ ప్రాంతాల్లో విజయం సాధించిన తమ అభ్యర్థులను ఈరోజే బెంగళూరుకు తరలించేలా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే మ్యాజిక్ నెంబర్కు కొద్ది దూరంలో కాంగ్రెస్ నిలిస్తే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను క్యాంప్కు తరలించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేతలు గురు, శుక్రవారాల్లో రెండు కీలక సమావేశాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ వారి ఎమ్మెల్యేలను రిసార్ట్కు పంపాలని ఆలోచిస్తోందా? అని డీకే శివకుమార్ను ప్రశ్నించగా..‘‘ఫలితాల కోసం వేచి ఉండండి’’ అని చెప్పారు. తాము తమ పని చేస్తున్నామని తెలిపారు.
ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. ఓల్డ్ మైసూర్, ముంబై కర్ణాటకలలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగిస్తుంది. బెంగళూరు, సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలలో బీజేపీ స్వల్ప ఆధిక్యం కనబరుస్తుంది.
ఇదిలా ఉంటే.. . కర్ణాటక ఎన్నికల ఫలితాల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని యతీంద్ర ధీమా వ్యక్తం చేశారు. అందువల్ల తమకు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే చాన్స్ ఉండకపోవచ్చని అన్నారు. ఒకవేళ తమకు మెజారిటీ రాని పక్షంలో ఏం చేయాలనే దానిపై ఢిల్లీలోని పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు.
ఒకవేళ మెజారిటీ రాకపోతే తమ నాయకులు ఏ విధమైన వ్యుహంతో ముందుకు వెళ్తారనే దానిపై తనకు సమాచారం లేదని తెలిపారు. తమ నాయకులు ఏ నిర్ణయం తీసుకున్న దానిని తాము పాటిస్తామని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రయోజనం కోసం బీజేపీని అధికారంలోకి రాకుండా ఏదైనా చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన తండ్రి సిద్దరామయ్య సీఎం కావాలని అన్నారు.
