దేవేగౌడతో సీఎం బసవరాజ్ బొమ్మై భేటీ.. కుతూహలం రేపుతున్న అసమ్మతి ఎమ్మెల్యే వ్యాఖ్యలు..
ఒకవేళ యడియూరప్ప వర్గీయులు తిరుగుబాటు లేవనెత్తితే అప్పుడు జేడీఎస్ మద్దతు పొందేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందన్నారు. కష్ట సమయంలో ఆదుకుంటామని మాజీ ప్రధాని దేవేగౌడ ఈ సమావేశం అనంతరం చేసిన వ్యాఖ్యలే ఇందుకు తార్కాణమన్నారు.
బీజేపీ అధిష్టానం సూచన మేరకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ అయ్యారని పార్టీ అసమ్మతి ఎమ్మెల్యే బసనగౌడ పాలిట్ యత్నాళ్ వ్యాఖ్యానించడం తీవ్ర కుతూహలం రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో మాజీ సీఎం యడియూరప్పతో సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగానే అధిష్టానం ఈ వ్యూహరచన చేసిందన్నారు.
ఒకవేళ యడియూరప్ప వర్గీయులు తిరుగుబాటు లేవనెత్తితే అప్పుడు జేడీఎస్ మద్దతు పొందేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందన్నారు. కష్ట సమయంలో ఆదుకుంటామని మాజీ ప్రధాని దేవేగౌడ ఈ సమావేశం అనంతరం చేసిన వ్యాఖ్యలే ఇందుకు తార్కాణమన్నారు.
యడియూరప్ప వెంట 20 మందిలోపే ఎమ్మెల్యేలు ఉన్నారని అంచనా వేస్తున్న యత్నాళ్ భవిష్యత్తులో వీరినుంచి సహకారం లభించకపోయినా బొమ్మై ప్రభుత్వం సాఫీగా కొనసాగేందుకు జేడీఎస్ సహకరిస్తుందని చెప్పారు. కాగా మీడియాలో వచ్చిన కథనాలను దేవేగౌడ తనయుడైన మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ కొట్టి పారేశారు.
ప్రభుత్వం చేపట్టే మంచి పనులకు నిర్మాణాత్మక సహకారం ఉంటుందన్న అర్థంతోనే దేవేగౌడ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. మొత్తానికి దేవేగౌడతో సీఎం భేటీ భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు ముందస్తు సంకేతాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.