కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మంత్రిత్వ శాఖలపై ఉత్కంఠ.. హోం శాఖ ఆయనకేనా?
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నారు. కొత్తగా 24 మంది చట్టసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. అనంతరం, పోర్ట్ఫోలియోల కేటాయింపు జరిగింది. సీఎం సిద్ధరామయ్య ఫైనాన్స్, క్యాబినెట్ వ్యవహారాల మంత్రిగా ఉండే అవకాశాలున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పట్టణ అభివృద్ధి, సాగు నీటి పారుదల శాఖలకు బాధ్యత వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోం శాఖ మాత్రం జీ పరమేశ్వరకు ఇస్తారని తెలుస్తున్నది.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదచేసుకున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా అక్కడ మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. సీఎం కుర్చీ కోసం పోటీ తరహాలోనే మంత్రివర్గ విస్తరణలోనూ సిద్దరామయ్య, డీకే శివకుమార్ల మధ్య పోటీ నెలకొన్నట్టు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొత్తగా 24 మంది చట్టసభ్యులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బెంగళూరులోని రాజ్భవన్లో వీరితో శనివారం ఉదయం ప్రమాణం చేయించారు. ఆ తర్వాత మంత్రులకు పోర్ట్ఫోలియోలను కేటాయించారు.
సీఎం సిద్దరామయ్య ఆర్థిక శాఖ, క్యాబినెట్ వ్యవహారాల శాఖను తనతో ఉంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కీలకమైన హోం శాఖను జీ పరమేశ్వరకు అప్పగిస్తున్నట్టు తెలుస్తున్నది. కాగా, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పట్టణ అభివృద్ధి శాఖ, సాగు నీటి పారుదల శాఖలకు బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని విశ్వసనీయ వర్గాల ప్రకారం, చెలువరయస్వామికి రవాణా శాఖ, మునియప్పకు రెవెన్యూ, సతిశ్ జర్కిహోలికి పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, బైరటి సురేశ్కు పట్టణ అభివృద్ధి శాఖలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఎంబీ పాటిల్కు పరిశ్రమ శాఖ, నాగేంద్రకు యువజన, క్రీడ శాఖ, వెంకటేశ్కు పశు సంవర్ధక, తింపుర్కు ఎక్సైజ్, రామలింగా రెడ్డికి బెంగళూరు డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ శాఖకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తున్నది.
శనివారం నాడు మంత్రులు ప్రమాణం తీసుకున్న చట్టసభ్యులు ఇలా ఉన్నారు. దినేశ్ గుండు రావ్, క్రిష్ణ బైర్ గౌడ్, ఈశ్వర్ ఖండ్రె, రహీమ్ ఖాన్, సంతోష్ ల్యాడ్, కేఎన్ రాజన్న, కే వెంకటేశ్, హెచ్సీ మహాదేవప్ప, బైరాటి సురేశ్, శివరాజ్ తంగడి, ఆర్బీ తింపుర్, బీ నాగేంద్ర, లక్ష్మీ హెబ్బలా్కర్, మధు బంగారప్ప, డీ సుధాకర్, చెలువరయ స్వామి, మంకుల్ వైద్య, ఎంసీ సుధాకర్లు కొత్తగా క్యాబినెట్లోకి ఎంటర్ అయ్యారు.
Also Read: Karnataka: దమ్ముంటే బజరంగ్ దళ్ను బ్యాన్ చేయండన్న బీజేపీ.. కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇదే
కొత్తగా ప్రమాణం చేసిన 24 ఎమ్మెల్యేల్లో తొమ్మిది మంది తొలిసారి మంత్రి బాధ్యతలు తీసుకోబోతున్న వారున్నారు. అందులో ఒక మహిళా మంత్రి కూడా ఉండటం గమనార్హం. వొక్కాలిగా కమ్యూనిటీకి చెందిన ఆరుగురు, లింగాయత్ నేతలు 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.