కర్ణాటకలో మసీద్ లాంటి బస్టాండు.. ఎంపీ హెచ్చరికలతో రూపు మారింది.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
కర్ణాటకలోని మైసూర్లో నూతనంగా నిర్మించిన బస్స్టాప్ వ్యవహారం మలుపు తిరిగింది. బీజేపీ ఎంపీ హెచ్చరికలతో మసీదును పోలిన బస్టాండ్ ఇప్పుడు రూపు మార్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ బస్టాండు మైసూరు-ఊటీ రోడ్డులో నిర్మించారు.
కర్ణాటకలోని మైసూర్లో నూతనంగా నిర్మించిన ఓ బస్టాండుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందని అనుకుంటున్నారా? ఈ బస్టాండు మసీదును పోలినట్టు ఉందని ఆరోపణలు రావడం, అదే తరుణంలో బస్టాండును కూల్చేస్తానని బీజేపీ ఎంపీ హెచ్చరికలతో ఆ బస్టాండు రూపు మార్చుకుంది. వివరాల్లోకెళ్తే.. మైసూరు-ఊటీ రోడ్డులో ఉన్న బస్టాండులో తొలుత మూడు డోమ్స్తో బస్టాండ్ నిర్మించారు. మధ్యలో పెద్ద డోమ్స్, ఆ డోమ్ కు ఇరు పక్కల రెండు చిన్నడోమ్లు ఉండేవి. ఈ మూడింటికి బంగారు రంగు పూత ఉండేది. కానీ, తాజా మార్పులతో మధ్యలో ఉన్న పెద్ద డోమ్ మాత్రమే ఉంచారు. రెండువైపులా ఉండే డోమ్లు తొలగించారు. ఆ డోమ్ రంగును కూడా మార్చారు. బంగారు రంగును తొలగించి.. ఆ డోమ్కు ఎరుపు రంగు వేశారు.
జేసీబీ తీసుకవచ్చి కూల్చివేస్తా.. ఎంపీ హెచ్చరికలు .
వాస్తవానికి మైసూరులోని నేషనల్ హైవే-766 వద్ద బీజేపీ ఎమ్మెల్యే రామ్దాస్ నూతనంగా బస్టాండ్ నిర్మించారు. మైసూరు ప్యాలెస్ స్ఫూర్తితో బస్టాండ్ను డిజైన్ చేసినట్టు బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు. కానీ, అది మసీదును పోలి ఉండటంపై కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదు లాంటి నిర్మాణాన్ని కూల్చివేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఎంపీ తొలుత స్పందిస్తూ.. ‘సోషల్ మీడియాలో చూశాను.. బస్టాండ్లో మూడు గోపురాలు, మధ్యలో పెద్దది, పక్కన రెండు చిన్నవి ఉన్నాయి.ఇది మసీదు లా ఉంది అని ఎంపీ ఆరోపించారు. మైసూర్లోని చాలా ప్రాంతాల్లో'గోపురం' నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కానీ.. అవేవి పట్టనట్టు మూడు నాలుగు రోజుల్లో నిర్మాణాన్ని కూల్చివేయాలని ఇంజినీర్లను కోరారు. చేయకుంటే జేసీబీ తీసుకుని కూల్చివేస్తానని బెదిరించినట్లు తెలిపారు. దీంతో కంగు తిన్న ఆ బస్టాండ్ను అధికారులు వెంటనే కూల్చివేశారు.
బీజేపీ ఎంపీల ఈ ప్రకటన విభజనతో కూడుకున్నదని విపక్షాలతో పాటు పలువురు విమర్శించారు. బస్టాప్ను నిర్మించిన స్థానిక బిజెపి ఎమ్మెల్యే రామ్ దాస్, ముందుగా తన పార్టీ సహోద్యోగి వ్యాఖ్యలను ఖండించారు. మైసూర్ ప్యాలెస్ స్ఫూర్తితో బస్ షెల్టర్ డిజైన్ చేసినట్లు తెలిపారు. అయితే, రామ్ దాస్ తర్వాత స్థానిక ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖలో క్షమాపణలు చెప్పాడు, 'మైసూర్ వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని బస్ స్టాప్ను రూపొందించాను' అని చెప్పాడు.
'నన్ను క్షమించండి'
ఈ తరువాత ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అందుకే రెండు గోపురాలను తొలగిస్తున్నామని, ఎవరి మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అని ఎమ్మెల్యే అన్నారు.అదే సమయంలో.. ఆదివారం (నవంబర్ 27) ఉదయం బిజెపి ఎంపి సింహా బస్ షెల్టర్లో చేసిన మార్పుల గురించి వార్తలను పంచుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేకు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
NHAI నోటీసు
అంతకుముందు.. ఎంపీ సింహా ట్వీట్ను దృష్టిలో ఉంచుకుని బస్ షెల్టర్ స్టాప్ను తొలగించాలని మైసూర్ సిటీ కార్పొరేషన్, కర్ణాటక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ (KRIDL)కి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నోటీసులు జారీ చేయడం గమనార్హం. 'వివాదాస్పద రకాల సమస్యలను' స్వీకరించడానికి ఈ నిర్మాణం రూపొందించబడిందని NHAI పేర్కొంది.