కరోనా పోవాలని హోమం, ఊరంతా పొగ పెట్టి.. బీజేపీ ఎమ్మెల్యే హల్ చల్...
కరోనా మహమ్మారి ఓ వైపు విలయతాండవం చేస్తుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు అదే స్థాయిలో వ్యాపిస్తున్నాయి. అలాంటి వాటిని నమ్మొద్దని, ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని జాతీయ ఆరోగ్య సంస్థ చెబుతున్నా అక్కడక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.
కరోనా మహమ్మారి ఓ వైపు విలయతాండవం చేస్తుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు అదే స్థాయిలో వ్యాపిస్తున్నాయి. అలాంటి వాటిని నమ్మొద్దని, ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని జాతీయ ఆరోగ్య సంస్థ చెబుతున్నా అక్కడక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.
ముక్కులో నిమ్మరసం పిండుకోవడం, ఒంటికి పేడ పూసుకోవడం, గో మూత్రం తాగడం లాంటివి ఇప్పటికే జనాల్లోకి వ్యాపించాయి. ఇలాంటివి ప్రాణాలకు ప్రమాదం అని నిపుణులు తేల్చేశారు.
తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే హోమం చేస్తే కరోనా పోతుందంటూ అగ్నిహోత్ర హోమం చేపట్టారు. హోమంతో ఆగితే బాగుండేది.. కానీ దాని తరువాత ధూపం పేరుతో ఊరంతా పొగ పెట్టాడు. సాంబ్రాణి వేస్తూ స్వయంగా ఆ ఎమ్మెల్యే రిక్షా బండి తోలుకుంటూ వెళ్లాడు.
కర్ణాటక లోని బెళగావి దక్షిణ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ మంగళవారం పూజలు చేశాడు. కొబ్బరి, నెయ్యి, బియ్యం ఇతర మూలికలు వేసి అగ్నిహోత్ర హోమం చేశాడు. అనంతరం ఒక రిక్షా బండిలో కూడా ఆ పదార్థాలన్నీ వేసి నిప్పు పెట్టాడు.
పొగ వస్తుండడంతో ఆ రిక్షా బండిని తన అనుచరులతో కలిసి గుంపుగా బెళగావి పట్టణంలో తిరిగాడు. ఆ పొగ పీలిస్తే కరోనా పోతుందని ఎమ్మెల్యే అభయ్ పాటిల్ తెలిపాడు. అయితే అతడి చర్యను ప్రతిపక్ష పార్టీలు తప్పు పట్టాయి. మూఢ నమ్మకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా తన అనుచరులతో తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘించారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.