కర్ణాటక అధికార పార్టీ ఎమ్మెల్యే బసవరాజు దడేసుగుర్ తనయుడు సురేష్ తన బర్త్ డే కేక్‌ను కత్తితో కాకుండా ఐఫోన్‌తో కట్ చేసి సంచలనానికి కేంద్రమయ్యాడు. కరోనాతో ప్రజలు సతమతమవుతుంటే హద్దులు మీరి వేడుకలు చేసుకోవడాన్ని ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా కాబట్టి ముందు జాగ్రత్తగా కత్తికి బదులు ఐఫోన్ వాడి ఉండొచ్చని సదరు ఎమ్మెల్యే కొడుకు చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

బెంగళూరు: ఓ ఎమ్మెల్యే కుమారుడు తన బర్త్‌డే కేక్‌ను కత్తితో కాకుండా ఐఫోన్‌తో కట్ చేశాడు. తన పేరులోని అక్షరానికో కేక్‌ను వరుసగా పెట్టి ఐఫోన్‌తో గీత గీసినట్టు కట్ చేసుకెళ్లాడు. కరోనా కాలంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ఎమ్మెల్యే కుమారుడి అతిశయాలపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే తన కొడుకును సమర్థించుకునే పనిలో పడ్డారు. కరోనా కాబట్టి ముందుజాగ్రత్తగా కత్తికి బదులు ఐఫోన్ వాడి ఉండొచ్చని బుకాయించుకొచ్చాడు. ప్రస్తుతం ఎమ్మెల్యే తనయుడి బర్త్‌డే కేక్ కటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కర్ణాటక రాజకీయాలను ఈ వీడియో కుదిపేస్తున్నది. అధికార పార్టీ ఎమ్మెల్యే బసవరాజ్ దడేసుగుర్ కుమారుడి బర్త్‌డే వీడియోనే ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్‌పై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన కుమారుడు సురేష్ కష్టార్జితంతో బర్త్ డే పార్టీ జరుపుకున్నాడని బసవరాజ్ చెప్పుకొచ్చారు. సురేష్ బర్త్‌డే పార్టీ హద్దులు దాటిందని, అవసరానికి మించిన డాబు ప్రదర్శించారని విమర్శలు వస్తున్నాయి. హోసపేటలో జరిగిన ఈ పార్టీకి సురేష్ తన స్నేహితులను ఓ లగ్జరీ కారులో తీసుకెళ్లాడన్న వార్తలు ఈ మంటలకు ఆజ్యం పోసినట్టయింది. ఈ ఘటన నేపథ్యంలో గతంలో ఎమ్మెల్యే బసవరాజ్ వ్యవహారాన్ని స్థానిక మీడియా వెలికి తెచ్చింది. ఎన్నికల ప్రచారానికీ డబ్బుల్లేవని ఆయన ప్రకటించారని, వాటికీ ప్రజల నుంచే క్రౌడ్ సోర్సింగ్ విధానంలో డబ్బులు సేకరించాడని ప్రస్తావించాయి. ఎమ్మెల్యేగా గెలువగానే మూడు లగ్జీర కార్లు కొన్నాడని ఆరోపించాయి.