కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పాయంత్రం 6 గంటల వరకు క్యూలో వేచి వున్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని అధికారులు తెలిపారు.
Karnataka Elections Live Updates : ముగిసిన పోలింగ్.. 5 గంటల వరకు 66 శాతం పోలింగ్

కర్ణాటక అసెబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవిఎంలను సరిచూసుకున్న ఎన్నికల సిబ్బంది పోలింగ్ ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు, ఎన్నికల అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
ముగిసిన పోలింగ్.. 5 గంటల వరకు 66 శాతం పోలింగ్
పోలింగ్ స్టేషన్లోనే డెలివరీ
బళ్లారి జిల్లాలోని పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అక్కడి పోలింగ్ బూత్ నెంబర్ 228లో మనీలా అనే గర్భిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఆమెకు అక్కడే నొప్పులు రావడంతో మనీలాను పోలింగ్ సిబ్బంది, స్థానిక మహిళలు పక్కగదిలోకి తీసుకెళ్లి ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డా క్షేమంగానే వున్నారు. అనంతరం వారిద్దరిని దగ్గరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ప్రశాంతంగా పోలింగ్.. 3 గంటల వరకు 52.03 శాతం ఓటింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.03 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈవీఎంలను ధ్వంసం చేసిన గ్రామస్తులు, విజయపురలో ఉద్రిక్తత
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే పోలింగ్ సందర్బంగా కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి. విజయపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకాలోని మసబినాల్ గ్రామంలోని ప్రజలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్) యంత్రాలను ధ్వంసం చేశారు. పోలింగ్ అధికారుల వాహనాలను కూడా ధ్వంసం చేశారు.
సెలబ్రిటీగా రాలేదు.. భారతీయ పౌరుడిగా వచ్చా : కిచ్చా సుదీప్
కర్ణాటక ఎన్నికల సందర్భంగా శాండిల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఒక సెలబ్రిటీగా ఇక్కడకు రాలేదని, ఒక భారతీయుడిగా ఇక్కడికి వచ్చానని అన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఓటును వేయాలని సుదీప్ పిలుపునిచ్చారు.
మంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
మంగళూరు నార్త్ జేడీఎస్ అభ్యర్థి బిఎ మొహియుద్దీన్ బావ మద్దతుదారులు నిన్న రాత్రి తమపై దాడి చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో గాయపడిన ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు నిజాం, హషర్లను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించడంతో బావ ఇటీవల జేడీ(ఎస్)లోకి మారారు.
కాంగ్రెస్కు 60 శాతం ఓట్లు.. 130-160 సీట్లు ఖాయం: సిద్ధరామయ్య
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 60 శాతం ఓట్లు వస్తాయని, 130 నుంచి 160 సీట్లు వస్తాయని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య బుధవారం ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా వరుణలో ఓటు వేసే ముందు విలేకరులతో మాట్లాడిన సిద్ధరామయ్య, రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓటు వేయాలన్న స్ఫూర్తి, ఉత్సాహం కనిపిస్తోందని.. ఓటింగ్ ప్రక్రియ పట్ల ప్రజలు మెచ్చుకోదగిన రీతిలో స్పందిస్తున్నారని సిద్ధూ పేర్కొన్నారు.
బీజేపీకే స్పష్టమైన మెజారిటీ : యడియూరప్ప ధీమా
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప.. బిజెపికి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్లో ఇదే విషయం వెల్లడవుతుందని ఆయన పేర్కొన్నారు. శివమొగ్గ జిల్లా శికారిపుర పట్టణంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన అనంతరం మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యడియూరప్ప కుమారుడు బి.వై. శికారిపుర నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయేంద్ర తన తండ్రితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
మధ్యాహ్నం 1 గంట వరకు 40% పోలింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద జనసందోహం కనిపిస్తోంది. దీంతో ఓటింగ్ శాతం కూడా అత్యధికంగా నమోదవుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 40శాతం ఓటింగ్ నమోదయ్యింది.
ఓటుహక్కును వినియోగించుకున్న మాజీ క్రికెటర్ శ్రీనాథ్
టీమిండియా మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ కర్ణాటక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వీడియో
ఓటేసిన సినీ ప్రముఖులు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సినీనటులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. కన్నడ హీరోలు ఉపేంద్ర, నిఖిల్, రిషబ్ శెట్టి, నటుడు ప్రకాష్ రాజ్,రమేష్ అరవింద్ తదితరులు ఓటుసారు.


ప్రశాంతంగా కర్ణాటక పోలింగ్... నాలుగు గంటల్లో 20% ఓటింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఓటేసేందుకు కన్నడ ప్రజలు ఆసక్తి చూపడంతో 11 గంటల వరకు 20.99% ఓటింగ్ నమోదయ్యింది.
ఓటేసిన మాజీ సీఎం కుమారస్వామి
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడిఎస్ నేత కుమారస్వామి రాంనగర పోలింగ్ బూత్ లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఓటేసిన కాంతారా హీరో రిషబ్ శెట్టి
కాంతారా హీరో రిషబ్ శెట్టి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
కర్ణాటకలో విజయంపై కాంగ్రెస్ ధీమా
కర్ణాటక కాంగ్రెస్ నాయకులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ చీఫ్ 141 సీట్లు సాధిస్తామంటే మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య 130కి పైగా సీట్లలో విజయం సాధిస్తామని అంటున్నారు.
ఓటేసిన జగదీశ్ శెట్టర్ కుటుంబం...
కర్ణాటక అసెంబ్లీల ఎన్నికల పోలింగ్ లో మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ పాల్గొన్నారు. కుటుంబసమేతంగా వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు.

పెళ్లిదుస్తుల్లో పోలింగ్ బూత్ కు... ఓటేసిన నవ వధువులు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పెళ్లికూతుళ్లు పాల్గొన్నారు. పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేసారు ఇద్దరు అమ్మాయిలు. చికబళ్లాపూర్ జిల్లా ముదిగెరె తాలుకా మకోనహళ్లిలో ఓ యువతి పెళ్లిదుస్తుల్లో వచ్చి ఓటేసారు. అలాగే కాపు నియోజకవర్గంలోని అవరలుమట్టు పోలింగ్ బూత్ లో ఇలాగే మరో పెళ్లికూతురు కూడా ఓటేసారు.


10 గంటలవరకు 13 శాతం పోలింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమవగా 10 గంటల వరకు అంటూ మూడుగంటల్లో 13శాతం ఓటింగ్ నమోదయ్యింది.
కాంగ్రెస్ కు 141 సీట్లు పక్కా...: డికె శివకుమార్
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ కు వెళ్లేముందు వీరిద్దరూ ఆలయాల్లో పూజలుచేసి వెళ్లారు. ఈ సందర్భంగా డికె కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్ 141 స్థానాల్లో విజయం సాధిస్తుందని 200శాతం నమ్మకంతో వున్నానని అన్నారు.
తొలి రెండుగంటల్లో 7.87 శాతం ఓటింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యింది. అయితే తొలి రెండు గంటల్లో అంటే 9గంటల వరకు 7.87 శాతం ఓటింగ్ నమోదయినట్లు తెలుస్తుంది. అత్యధికంగా ఉడుపిలో ఇప్పటివరకు 13.28 శాతం ఓటింగ్ నమోదయ్యింది.