ఓవర్టేక్ చేయబోయి పెద్ద గుంతలో పడిన బస్సు.. 30 మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం
Kanpur: రోడ్డుపై ముందుగా వెళ్తున్న ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన బస్సు పెద్ద గుంతలో పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
Kanpur Road accident: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన ఒక ప్రయివేటు బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్ద గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలోని రసూలాబాద్ పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన ఒక ప్రయివేటు బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్ద గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తమైన అధికారులకు, అంబులెన్స్ కు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడంలో సాయం అందించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, బస్సు పడిన పెద్ద గుంత మొత్తం నీటితో నిండిపోయిందని సమాచారం. లేకుంటే ఈ ప్రమాదంలో పెద్దఎత్తున ప్రమాదం జరిగివుండేదని స్థానికులు, అధికారుల సమాచారం. ప్రమాదానికి గురైన బస్సు కాన్పూర్ నుంచి బయలుదేరి రసూలాబాద్ వైపు వెళ్తోంది. కహింజ్రీ పట్టణం దాటిన తర్వాత, ప్రైవేట్ బస్సు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఓవర్ టేక్ చేసి దూసుకుపోయింది. ఈ క్రమంలోనే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో పెద్ద గుంతలో పడింది. ఆ సమయంలో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20-25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహకారంతో వారిని రసూలాబాద్లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదిలావుండగా, కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) కు చెందిన బస్సు సోమవారం ప్రమాదానికి గురైంది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం కొండ జిల్లా చీయప్పర, నెరియమంగళం మధ్య ఒక ప్రదేశంలో ఉదయం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్నాకులం నుంచి మున్నార్కు వెళ్తున్న బస్సు మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా టైర్ పగిలిపోవడంతో కాలువలో పడింది. అయితే చెట్టును ఢీకొట్టడంతో ఆగిపోవడంతో కింద లోతైన వాగులో పడలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
బస్సుకు ప్రమాదం జరిగినప్పుడు అందులో 60 మంది ఉన్నారని బస్సు కండక్టర్ సుభాష్ తెలిపారు. ‘‘ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఎదురుగా వచ్చిన వాహనం బస్సును ఢీకొట్టిందని డ్రైవర్ చెప్పాడు. భారీ వర్షం కురుస్తున్నందున సరిగా కంట్రోల్ కాలేదు” అని సుభాష్ పీటీఐకి తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి సంజీవన్ (33)గా అధికారులు గుర్తించారు.