ట్విట్టర్లో మళ్లీ కంగనా రనౌత్ సందడి.. రెండేళ్ల తర్వాత అకౌంట్ పునరుద్ధరణ.. ఫస్ట్ ట్వీట్ ఇదే
కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా మళ్లీ పునరుద్ధరించారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఆమె ట్విట్టర్లో మెరిశారు. అయితే, ఆమెకు ఇంకా బ్లూ టిక్ ఇవ్వలేదు. 2021 మే నెలలో ఆమె ట్విట్టర్ అకౌంట్ను పర్మనెంట్గా సస్పెండ్ చేశారు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ మళ్లీ ట్విట్టర్లో మెరిసింది. సుమారు రెండేళ్ల తర్వాత ఆయన ట్విట్టర్ ఖాతా మళ్లీ రీస్టోర్ అయింది. 2021 మేలో ఆమె అకౌంట్ను ట్విట్టర్ పర్మనెంట్గా సస్పెండ్ చేసింది. మళ్లీ ఆమె ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఆమె జనవరి 24వ తేదీన తొలి ట్వీట్ చేశారు. హలో ఎవ్రివన్, మళ్లీ ఇక్కడకు రావడం బాగుందని ఆమె ట్వీట్ చేశారు. అయితే, ఆమె అకౌంట్కు ఇంకా బ్లూ టిక్ ఇవ్వలేదు. అలాగే, ఆమె తన ఎమర్జెన్సీ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.
కంగనా రనౌత్ ట్విట్టర్ గైడ్లైన్స్ను ఉల్లంఘించారని, వివాదాస్పద ట్వీట్ చేశారని పేర్కొంటూ ఆమె ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేశారు. విద్వేషపూరిత ప్రవర్తన, అబ్యూజివ్ బిహేవియర్ ద్వారా చాలా సార్లు ట్విట్టర్ పాలసీని ఉల్లంఘించారని వివరించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింస గురించి ఆమె వివాదాస్పద ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తర్వాతే ఆమె అకౌంట్ను సస్పెండ్ చేశారు.
Also Read: సినిమా కోసం ఆస్తులు అమ్ముకున్న కంగనా రనౌత్, ఆందోళనలో అభిమానులు
కంగనా రనౌత్ చాలా సార్లు వివాదాస్పద, ఫిల్టర్ లేకుండా వ్యాఖ్యలు ట్విట్టర్లో చేశారు. చాలా సార్లు ఆమె ట్వీట్లు రెచ్చగొట్టడానికి పిలుపు ఇచ్చేలా ఉన్నదనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఆమె ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసిన తర్వాత న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో కంగనా రనౌత్ మాట్లాడుతూ, ట్విట్టర్ తనను సస్పెండ్ చేసి మరోసారి వారు అమెరికన్లు అని నిరూపించుకున్నారని అన్నారు. వారు పుట్టుకతోనే శ్వేతవర్ణ ప్రజలు ఇతరులను బానిసలుగా చూసే హక్కును కలిగి ఉంటారని భావిస్తుంటారని వివరించారు. ఏం ఆలోచించాలి? ఏం చేయాలి? ఏం మాట్లాడాలి? అనే విషయాలనే వారే నిర్ణయించి చెప్పాలని అనుకుంటారని ఆరోపించారు. ఈ దేశ ప్రజలు ఏళ్ల తరబడి అణచివేత, వేధింపులు ఎదుర్కొన్నారని, ఇంకా ఎదుర్కొంటున్నారని తెలిపారు.