అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో తమిళనాట సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ పోత్తులు పొడుస్తున్నాయి. తాజాగా ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ నేతృత్వంలో మరో కూటమి తెరపైకి వచ్చింది

అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో తమిళనాట సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ పోత్తులు పొడుస్తున్నాయి. తాజాగా ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ నేతృత్వంలో మరో కూటమి తెరపైకి వచ్చింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సీనియర్ నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) అధినేత శరత్ కుమార్ తాజాగా కమలహాసన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం శరత్ కుమార్ మాట్లాడుతూ, కమల్ పార్టీ మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్ఎం)తో పొత్తుకు ప్రతిపాదన చేశామని వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎంతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్న విషయాన్ని కమల్ కు వివరించానని, అయితే పొత్తుపై ఏం నిర్ణయం తీసుకుంటారన్నది వారికే వదిలేశామని శరత్ కుమార్ తెలిపారు.

సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, ఇండియా జననాయగ కట్చి (ఐజేకే) పార్టీతో తమ పొత్తు ఖరారైందని శరత్ కుమార్ వెల్లడించారు.

శరత్ కుమార్ స్థాపించిన ఏఐఎస్ఎంకే పార్టీ అధికార అన్నాడీఎంకే మిత్రపక్షంగా గుర్తింపు పొందింది. శరత్ కుమార్ తాజా ప్రయత్నాలు చూస్తుంటే అధికార పక్షానికి దూరం జరిగినట్టు అర్థమవుతోంది.

మరోవైపు కూటమి ఏర్పాటుపై ప్రకటన చేశారు కమల్ హాసన్. కూటమి తరపున సీఎం అభ్యర్ధిని తానేనని తెలిపారు. తమతో కూటమి ఏర్పాటుకు ఏ పార్టీ అయినా ముందుకు రావొచ్చని కమల్ స్పష్టం చేశారు. నటుడు శరత్ కుమార్ తనతో కలవడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.