విద్వేష ప్రసంగం ఆరోపణలు.. కాజల్ హిందుస్థానీని అరెస్ట్ చేసిన పోలీసులు..
హిందూ యాక్టివిస్ట్ కాజల్ హిందుస్థానీ గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
అహ్మదాబాద్: హిందూ యాక్టివిస్ట్ కాజల్ హిందుస్థానీ గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు. వివరాలు.. గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లా ఉనా పట్టణంలో శ్రీరామ నవమి రోజున విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ హిందూస్థానీ.. ఓ మైనారిటీ వర్గం మహిళలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాజల్ ప్రసంగం ముగిసిన తర్వాత ఉనా పట్టణంలోని సున్నిత ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగాయి.
ఈ ఘర్షణలకు సంబంధించి పోలీసులు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాజల్ హిందుస్థానీపై కేసు నమోదు చేశారు. కాజల్ హిందుస్తానీ.. వాస్తవానికి జామ్నగర్ నివాసి.. అయితే ఉనాలో జరిగిన కార్యక్రమంలో ఒక నిర్దిష్ట వర్గానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడారని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. “మేము రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసాం. ఒకటి కాజల్ హిందుస్తానీ ద్వేషపూరిత ప్రసంగానికి వ్యతిరేకంగా.. మరొకటి అల్లర్లకు వ్యతిరేకంగా ఉంది’’ అని పోలీసు సూపరింటెండెంట్ శ్రీపాల్ శేష్మా విలేకరులకు తెలిపారు.
ఇక, కాజల్ హిందుస్తానీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు శనివారం వరకు అరెస్టు చేయలేదు. మరోవైపు కాజల్ హిందుస్థానీ దిగువ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ఆ తర్వాత కాజల్ హిందుస్థానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాజల్ హిందుస్థానీని మేజిస్ట్రేట్ నివాసంలో ఆయన ముందు హాజరుపరిచిన తరువాత జునాగఢ్ జైలుకు తరలించారు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటనకు సంబంధించి కాజల్ హిందుస్థానీకి వీహెచ్పీ దూరంగా ఉంది. ఉనా ర్యాలీకి ఆమెను ఆహ్వానించలేదని కూడా పేర్కొంది. ఇక, కాజల్ హిందుస్థానీని కాజల్ శింగలా అని కూడా పిలుస్తారు.