సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణస్వీకారం.. ఆయన నేపథ్యం ఏంటంటే ?
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ దీపాంకర్ దత్తా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ డీవై చంద్రచూడ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ దత్తాకు పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కొత్త న్యాయమూర్తికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అభినందనలు తెలిపారు. ‘‘ భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాల ప్రకారం జస్టిస్ దీపాంకర్ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయనకు నా శుభాకాంక్షలు ’’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
మాజీ సీజేఐ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సెప్టెంబర్ 26వ తేదీన జరిగిన సమావేశంలో జస్టిస్ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. ఆయన నియామకంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. ఆయన పదవీ కాలం 2030 ఫిబ్రవరి 8 వరకు ఉంటుంది.
2020 ఏప్రిల్ 28న బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ దత్తా 2006 జూన్ 22న కలకత్తా హైకోర్టు బెంచ్ కు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సలీల్ కుమార్ దత్తా కుమారుడు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అమితవ రాయ్ బావమరిది. 1965 ఫిబ్రవరిలో జన్మించిన ఆయన 1989 లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బీ పట్టా పొందారు.
దీపాంకర్ దత్తా 1989 నవంబర్ 16వ తేదీన న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1998 నుండి భారత యూనియన్ కు న్యాయవాదిగా పనిచేశారు. 2002 మే 16 నుంచి 2004 జనవరి 16 నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి జూనియర్ స్టాండింగ్ కౌన్సెల్ గా సేవలు అందించారు. కాగా.. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో తీవ్ర జాప్యంపై దేశ అత్యున్నత ధర్మాసనం ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టిన నేపథ్యంలో జస్టిస్ దత్తా నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.