Soumya Vishwanathan : జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసు.. నలుగురికి జీవిత ఖైదు విధించిన ఢిల్లీ కోర్టు
జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు జీవిత ఖైదు, ఐదో దోషికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. టీవీ జర్నలిస్టుగా ఉన్న ఆమె 2008లో హత్యకు గురయ్యారు.
![Journalist Soumya Vishwanathan murder case.. Delhi court sentenced four to life imprisonment..ISR Journalist Soumya Vishwanathan murder case.. Delhi court sentenced four to life imprisonment..ISR](https://static-ai.asianetnews.com/images/01hd1gamgeqjncdjv7xnbp2yv4/soumya-vishwanathan_363x203xt.jpg)
Journalist Soumya Vishwanathan : 2008లో ఢిల్లీలో జరిగిన జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నిందితులకు ఢిల్లీ కోర్టు శిక్ష ఖరారు చేసింది. నలుగురు దోషులకు జీవిత ఖైదు, ఐదో దోషికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ నేరం అత్యంత అరుదైన నేరం కిందకు రాదని, అందువల్ల దోషులకు మరణశిక్ష విధించలేదని కోర్టు తెలిపింది. దోషులుగా తేలిన రవికపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అజయ్ కుమార్ లకు యావజ్జీవ కారాగార శిక్ష, వారికి సహకరించిన ఐదో దోషి అజయ్ సేథీకి మూడేళ్ల జైలు శిక్ష పడింది.
‘హెడ్ లైన్స్ టుడే’లో న్యూస్ ప్రొడ్యూసర్ గా పని చేసే 25 ఏళ్ల జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ 2008 సెప్టెంబర్ 30వ తేదీన తన పని ముగించుకుని తెల్లవారుజామున 3.03 గంటలకు ఝండేవాలాన్ కార్యాలయం నుంచి బయలుదేరారు. తన కారు తీసుకొని వసంత్ కుంజ్ లో ఉన్న ఇంటికి ప్రయాణం మొదలుపెట్టారు. అయితే ఆ సమయంలో సౌమ్య ఒంటరిగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లడాన్ని కపూర్, శుక్లా, కుమార్, మాలిక్ లు గమనించారు.
ఆమెను దోపిడి చేయాలనే ఉద్దేశంతో కారును ఫాలో అయ్యారు. తొలుత సౌమ్య కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె కారును ఆపలేదు. దీంతో కపూర్ నాటు తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్ ఆమె తలకు తగిలింది. దీంతో సౌమ్య అక్కడికక్కడే మరణించింది. ఆమె ఇంటికి సమీపంలో ఉన్న నెల్సన్ మండేలా మార్గ్ లో కారు డివైడర్ ను ఢీకొని ఆగిపోయింది.
అనంతరం హంతకులు అక్కడి నుంచి పరాపోయారు. అయితే 20 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి బాధితురాలి పరిస్థితిని పరిశీలించారు. పోలీసులను చూడగానే వారు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. ఇంక కాలం కోర్టులో విచారణ జరిగింది. తాజాగా దోషులకు శిక్ష ఖరారు అయ్యింది.