ఉమ్మడి ఆదిలాబాద్ ను వణికిస్తోన్న చలి.. అర్లి (టీ)లో 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భీంపూర్ మండలం అర్లి (టీ) గ్రామంలో అయితే రాష్ట్రంలోనే అత్యల్పంగా 5.7 డిగ్రీల చలి నమోదైంది.
జనవరి చివరికి వచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad)ను చలి వదలడం లేదు. జనవరి మొదటి వారంలో వాతావారణంలో మార్పుల వల్ల కొంత చలి తీవ్రత తగ్గినట్టు అనిపించినప్పటికీ.. మళ్లీ ఒక్క సారిగా చలి పెరిగింది. గత 5 రోజుల నుంచి అయితే విపరీతంగా చల్లగాలులు వీస్తున్నాయి. పొగ మంచు దట్టంగా అలుముకుంటోంది. ఈ పొగమంచు కారణంగా ప్రజలకు ఇంట్లో నుంచి ఉదయం 8 గంటల వరకు బయటకు రావడం లేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రోజు మొత్తం చలి వణికిస్తుండటంతో వృద్దులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలోనే గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ (bheempur) మండలం అర్లి (టీ) (arli t) గ్రామంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ గ్రామంలో 5.7 డిగ్రీలో కనిష్ట ఉష్ణోగ్రత వెలుగుచూసింది. అలాగే ఇదే జిల్లాలోని సిర్పూర్ యూ లో 6.1 డిగ్రీలు, పిప్పల్ ధరిలో 7.0 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ ప్రాంతంలో 7.2 డిగ్రీలు జైనథ్ మండలంలో 7.5 డిగ్రీలు, తాంసి మండలంలో 7.5 డిగ్రీలు, రాంగనర్ (మావల)లో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో 7.7 డిగ్రీలు, బేల మండలంలోని చప్రాలలో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు వెలుగు చూశాయి.
అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయాదైన అర్లి (టీ) గ్రామంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం దట్టమైన పొగమంచు పేరుకుపోతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. చలికి తట్టుకోలేక ఉదయం 8.30 గంటల వరకు ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. సాయంత్రం 5 తరువాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఎక్కడ చూసినా చలి మంటలు వెలుస్తున్నాయి. గత నెలలో పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన స్పెషల్ క్లాసులకు చలి ప్రభావం వల్ల కేవలం ఇద్దరు, ముగ్గురు పిల్లలు మాత్రమే హాజరయ్యారు. ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ ఏడాది ఈ ప్రాంతంలో చలి అధికంగానే ఉంటుంది. రెండేళ్ల కిందట ఈ ప్రాంతంలో కనిష్టంగా 2 డిగ్రీల చలి నమోదైంది. దీంతో అప్పటి కలెక్టర్ దివ్య దేవరాజన్ (divya devarajan) గ్రామాన్ని సందర్శించారు. వృద్ధులకు, చిన్నారులకు దుప్పట్లు, స్వెట్టర్లు పంపిణీ చేశారు. వైద్య అధికారులను అలెర్ట్ చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి గ్రామస్తులను చలి నుంచి రక్షణను అందించే దుస్తులను అందించాయి. చలికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాయి.
జాగ్రత్తలు అవసరం..
ఆదిలాబాద్ జిల్లా పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితేనే రాత్రి, ఉదయం వేళల్లో బయటకు వెళ్లాలని చెబుతున్నారు. చలి నుంచే రక్షణనిచ్చే దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. గోరు వెచ్చటి నీళ్లు, వేడి వేడి ఆహారం తీసుకోవడం ద్వారా చలి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను కొంత వరకు దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కోరుతున్నారు.