అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఏడాది సెప్టెంబర్లో భారతదేశం పర్యటనకు రానున్నారని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలకు సంబంధించి అమెరికా విదేశాంగ కార్యదర్శి డొనాల్డ్ లూ తెలిపారు. విదేశాంగ కార్యదర్శి టోనీ బ్లింకెన్, ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్, వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోలు కూడా భారత్కు రానున్నారని డొనాల్డ్ చెప్పారు.
భారత్- అమెరికా సంబంధాలకు సంబంధించి ఈ ఏడాది కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యాధినేత జో బైడెన్ ఈ ఏడాది భారతదేశ పర్యటనకు వస్తారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జీ 20 సమ్మిట్లో భాగంగా సెప్టెంబర్లో బైడెన్ భారత్లో పర్యటిస్తారని.. ఇది దక్షిణ, మధ్య ఆసియా దేశాలకు సంబంధించి ఆయన పరిపాలనా యంత్రాంగానికి ఇది కీలక విషయంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ ఏడాది జీ 20 దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని ఓ అధికారి అన్నారు.
జీ20 సమ్మిట్కు భారత్ ఆతిథ్యం వహిస్తుంటే.. అమెరికా ఏపీఈసీని నిర్వహిస్తోందని, జపాన్ జీ7కి ఆతిథ్యం ఇస్తోందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలకు సంబంధించి అమెరికా విదేశాంగ కార్యదర్శి డొనాల్డ్ లూ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఈ పరిణామాలు క్వాడ్ దేశాలను మరింత దగ్గర చేస్తాయని ఆయన ఆకాంక్షించారు. తమ అధ్యక్షుడు ఈ సెప్టెంబర్లో భారతదేశానికి రావాలని ఎదురుచూస్తున్నారని డొనాల్డ్ అన్నారు.
జీ20 సమ్మిట్లో భాగంగా ఇది బైడెన్ తొలి భారతదేశ పర్యటన అని దీనిపై తాము సంతోషంగా వున్నట్లు ఆయన చెప్పారు. విదేశాంగ కార్యదర్శి టోనీ బ్లింకెన్, ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్, వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోలు కూడా భారత్కు రానున్నారని డొనాల్డ్ చెప్పారు. ఈ ఏడాది మార్చిలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశం నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. ఈ నెలలో భారతదేశంలో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి వస్తున్నట్లు డొనాల్డ్ తెలిపారు.ఇప్పటికే యూఎస్ ఎంబసీలోని భారత్, అమెరికా సిబ్బంది నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించిందన్నారు. ఇరుదేశాల సంబంధాలను గార్సెట్టి కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
