రెచ్చిపోయిన ఉగ్రవాదులు... పోలీసు అధికారి, ఆయన భార్య మృతి
బలవంతంగా వారి ఇంట్లోకి చొరబడి మరీ ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. ఉగ్రవాదులు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామాలో స్పెషల్ పోలీసు అధికారి( ఎస్పీవో), అతని భార్యను ఉగ్రవాదులు అతి దారుణంగా చంపేశారు. బలవంతంగా వారి ఇంట్లోకి చొరబడి మరీ ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. ఉగ్రవాదులు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో.. దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు పుల్వామాలోని హరిపరిగ్రామ్లో ఉంటున్న మాజీ ఎస్పీవో ఫయాజ్ అహ్మద్ ఇంటిలోకి చొరబడి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రవాద దాడిలో మాజీ అధికారి అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ ఘటనలో ఫయాజ్ అహ్మద్ కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.