చారిత్రాత్మకమైన రోజు.. మూడు దశాబ్దాల తర్వాత సినిమా హాల్స్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?
కశ్మీర్ లోని ఫుల్వామా, షోపియాన్ జిల్లాలలో ఆదివారం లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మల్టీపర్పస్ సినిమా హాళ్లను ప్రారంభించారు. వీటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు
కశ్మీర్ కు సెప్టెంబర్ 18 చారిత్రాత్మకమైన రోజుగా మారింది. ఎందుకంటే.. దాదాపు మూడు దశాబ్దాల తరువాత.. కశ్మీర్లో సినిమా హాల్స్ అందుబాటులోకి వచ్చాయి. దక్షిణ కాశ్మీర్లోని ఫుల్వామా, షోపియాన్ జిల్లాలలో ఆదివారం మల్టీపర్పస్ సినిమా హాల్ను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. వీటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్కు ఈరోజు చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. పుల్వామా, షోపియాన్లలో మల్టీపర్పస్ సినిమా హాళ్లు ప్రారంభమయ్యాయి. భవిష్యత్లో జమ్ములోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్ను నెలకొల్పుతామని తెలిపారు. సినిమా స్క్రీనింగ్ తో పాటు ఇన్ఫోటైన్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మూడు దశాబ్దాల తర్వాత సినిమా హాళ్లు ప్రారంభమయ్యాయని తెలిపారు.
అనంత్నాగ్, శ్రీనగర్, బందిపొరా, గందర్బల్, దోడా, రాజౌరి, పూంచ్, కిష్త్వార్, రియాసీలలో త్వరలో సినిమా హాళ్లను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్ యొక్క మొదటి INOX మల్టీప్లెక్స్ వచ్చే వారం ప్రజల కోసం తెరవబడుతుంది. ఇందులో మొత్తం 520 సీట్ల సామర్థ్యంతో మూడు సినిమా హాళ్లు ఉంటాయి.
1980-90 నాటికి కశ్మీర్ లోయలో దాదాపు డజను సినిమా హాళ్లు ఉండేవి, అయితే రెండు తీవ్రవాద సంస్థలు సినిమా హాల్ యజమానులను బెదిరించడంతో సినిమా హాళ్లను మూసివేయవలసి వచ్చింది. 1990ల చివరలో అధికారులు కొన్ని థియేటర్లను తిరిగి తెరవడానికి ప్రయత్నించినప్పటికీ.. 1999లో లాల్ చౌక్లోని రిగాల్ సినిమా థియేటర్పై గ్రెనేడ్ దాడి జరగడం వల్ల ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. అనంతరం ఆ నగరంలోని నీలమణి, బ్రాడ్వే సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శన చేసినప్పటికీ.. పేలవమైన స్పందన కారణంగా మూసివేయవలసి వచ్చింది.
కాశ్మీర్ లోయ ప్రజలు తమ ప్రాంతంలోని పెద్ద తెరపై సినిమాలను చూసి ఆనందించగలరనీ, దీంతో వ్యాపార, టూరిజం రంగాలు అభివృద్ది చెందుతాయని సామాన్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల టూరిజం కూడా పుంజుకుంటుందన్నారు. అలాగే.. స్థానిక ప్రజలు సినిమా చూసి ఆనందించడానికి వందల కిలోమీటర్ల దూరం జమ్మూకి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.
సినిమాకు కాశ్మీర్ మధ్య సంబంధం పాతతే.. కానీ..టెర్రరిజం కారణంగా ఈ సంబంధంలో కొంత దూరం పెరిగింది. అది ఇప్పుడు నెమ్మదిగా చెరిపివేయబడుతోంది. ఇక్కడ సినిమా షూటింగ్కు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది. దీని వల్ల చిత్ర నిర్మాతలతో పాటు స్థానికులకు కూడా మేలు జరుగుతుంది.