బిహార్ సీఎం నితీశ్ కుమార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుల ఆధారిత సర్వే సరిగా జరగలేదని భావిస్తున్నట్టు జితన్ చేసిన కామెంట్లపై నితీశ్ ఫైర్ అయ్యారు. నా మూర్ఖత్వం వల్లే ఆయన సీఎం అయ్యారని పేర్కొన్నారు. 

పాట్నా: బిహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీపై సీఎం నితీశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నా మూర్ఖత్వం వల్ల ఆయన సీఎం అయ్యాడు అంటూ బిహార్ రాష్ట్ర అసెంబ్లీలో కామెంట్ చేశారు. బిహార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల ఆధారిత సర్వే సక్రమంగా చేపట్టలేదని తాను సంశయిస్తున్నట్టు వివరించారు. ఒక వేళ ఆ డేటా మొత్తం తప్పు అయితే.. ఫలితాలు కూడా చేరాల్సిన వారికి చేరవని జితన్ రామ్ మాంఝీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

‘మేం ఆయనను ముఖ్యమంత్రిని చేశాం. ఆయన ఇప్పటికీ నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన కేవలం నా మూర్ఖత్వం వల్లే బిహార్ ముఖ్యమంత్రి అయ్యాడు’ అంటూ పరుష పదజాలంతో నితీశ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. నితీశ్ కుమార్ వ్యాఖ్యలతో అసెంబ్లీలో గందరగోళం రేిగింది. ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఆందోళనలు చేశారు. 

ఓ బీజేపీ ఎమ్మెల్యే బిహార్ సీఎంపై విరుచుకుపడ్డారు. సీఎంకు పిచ్చెక్కినట్టు ఉన్నదని బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణానందన్ పాశ్వాన్ అన్నారు. ఈ రభస మధ్యలో సమావేశాలను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. ‘జితన్ రామ్ మాంఝీని అవమానకర భాషలో దూషించాడు. మేం ఈ తీరును ఎంతమాత్రం ఉపేక్షించం. సీఎం మానసిక స్థితి సరిగా లేనట్టుంది. ఆయనకు ట్రీట్‌మెంట్ అవసరం’ అని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు.

Also Read: ప్రతిష్టంభనకు చెక్.. చివరి ఐదు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్ , పటాన్‌చెరులో అభ్యర్ధి మార్పు

నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై జితన్ రామ్ మాంఝీ కూడా తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో అవమానకర రీతిలో పరాజయం పొందిన తర్వాత రాజకీయంగా ప్రతిష్టను కాపాడుకోవడానికి నితీశ్ కుమార్ నన్ను ముఖ్యమంత్రి చేశాడని జితన్ రామ్ అన్నారు. ‘ఆయన నా గురించి మాట్లాడిన మాటలు వింటే షాక్ అయ్యాను. కొన్ని రోజుల క్రితం చూసిన నితీశ్ కుమారేనా ఈయన. అసలు ఆయన మానసిక స్థితి దెబ్బతిన్నదేమో అని అనిపిస్తున్నది. బహుశా అందుకే ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నేను ఆయన కంటే వయసులో పెద్ద అయినా అమర్యాదగా మాట్లాడాడు’ అని వివరించారు.