టాయిలెట్ నాకిస్తూ గిరిజన మహిళకు బీజేపీ నేత సీమాపాత్ర చిత్రహింసలు.. పార్టీ నుంచి సస్పెండ్
జార్ఖండ్: తన ఇంట్లో పని మనిషిగా చేస్తున్న ఓ గిరిజన మహిళను జార్ఖండ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు సీమాపాత్ర తీవ్ర చిత్రహింసలకు గురిచేయడంతో పాటు వారి టాయిలెట్ ను నాలుకతో శుభ్రం చేయించారు. దీంతో ఆమెపై కేసు నమోదైంది.
బీజేపీ నాయకురాలు సీమాపాత్ర: బీజేపీ నాయకురాలు సీమా పాత్ర తన ఇంటి పనిమనిషిని చిత్ర హింసలకు గురిచేశారనే ఆరోపణలతో జార్ఖండ్ బీజేపీ ఆమెను సస్పెండ్ చేసింది. గిరిజన మహిళ తన ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుండగా, ఆమెను చిత్రహింసలకు గురిచేసినందుకు సీమా పాత్రపై కేసు నమోదైంది. సునీత అనే పనిమనిషిని నాలుకతో టాయిలెట్ను శుభ్రం చేయించారు. సెలవులు అడిగితే తవ్రంగా కొట్టడంతో పాటు గదిలో బంధించారని బాధితురాలు ఆరోపించింది. ఒకసారి తనను ఇనుప రాడ్ తో కొడితే పళ్లు ఊడిపోయాయని కూడా పేర్కొంది. ఈ క్రమంలోనే బీజేపీ ఆమెపై చర్యలు తీసుకుంది. బీజేపీ నాయకురాలైన సీమా పాత్ర ఫేస్ బుక్ ప్రొఫైల్ వివరాల ప్రకారం.. బీజేపీ మహిళా విభాగం జాతీయ కార్యవర్గ సభ్యురాలు. ఆమె భర్త రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి మహేశ్వర్ పాత్ర. సీమా పాత్ర కేంద్రానికి రాష్ట్ర కన్వీనర్ కూడా. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం 'బేటీ బచావో, బేటీ పడావో' ప్రచార విభాగంలోనూ ఉన్నారని సమాచారం. సీమా పాత్ర గత 8 ఏళ్లుగా బాధిత మహిళ సునీతను చిత్రహింసలకు గురిచేస్తోందని ఆరోపణలు వచ్చాయి.
— The Dalit Voice (@ambedkariteIND) August 30, 2022
గిరిజన మహిళ సునీత శరీరమంతా పలు గాయాలయ్యాయి. సీమా పాత్ర తనను వేడి వస్తువులతో కాల్చేదని ఆమె ఆరోపించింది. జార్ఖండ్ బీజేపీ చీఫ్ దీపక్ ప్రకాష్ .. సీమా పాత్రను హింసించారని ఆరోపిస్తూ ఆమె ఇంటి పనిమనిషి వీడియోలు వైరల్ కావడంతో ఆమెపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా, మీడియా కథనాల్లో వచ్చిన వీడియోలలో సునీత అనే గిరిజన మహిళ ఆసుపత్రి బెడ్పై కనిపిస్తుంది. ఆమె పళ్ళు చాలా వరకు కొట్టడంతో ఊడిపోయినట్టు కనిపించాయి. ఆమె కూర్చోలేని స్థితిలో ఉంది. ఆమె శరీరంపై గాయం గుర్తులు ఉన్నాయి. అలాగే, ఆమెపై పదేపదే దాడికి పాల్పడినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. ఈ విజువల్స్ సర్వత్రా ఆగ్రహాన్ని రేకెత్తించాయి. సీమాపాత్రను వెంటనే అరెస్టు చేయాలని పిలుపునిచ్చారు. బాధితురాలు జార్ఖండ్లోని గుమ్లా నివాసి. సీమాపాత్ర తనపై దాడి చేస్తుంటే.. సీమా పాత్ర కుమారుడు ఆయుష్మాన్ తనను కాపాడటానికి సాయం చేశాడని తెలిపింది. "అతని వల్లనే నేను బ్రతికి ఉన్నాను" అని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది.
సీమాపాత్రపై కేసు నమోదు
గిరిజన మహిళను చిత్రహింసలకు గురిచేసిన సీమాపాత్రపై కేసు నమోదైంది. పోలీసులు రాంచీలోని అర్గోడా పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC), SC-ST చట్టం-1989లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో ఈ ఘటన రాజకీయ మలుపు తీసుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ సీమాపాత్రను సస్పెండ్ చేసింది.
రంగంలోకి మహిళా కమిషన్
జార్ఖండ్లో సీమా పాత్ర తన ఇంటి పనిమనిషిని వేధిస్తున్నట్లు వచ్చిన నివేదికలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా పరిగణలోకి తీసుకుంది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ.. ప్యానెల్ ఆరోపణలు నిజమని తేలితే నిందితులను అరెస్టు చేయాలని జార్ఖండ్ డీజీపికి లేఖ రాసింది. "ఈ విషయంలో న్యాయమైన-కాలపరిమితితో కూడిన విచారణ కోసం కమిషన్ లేఖ రాసింది" అని రేఖా శర్మ చెప్పారు. అలాగే, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని కమిషన్ కోరిందని తెలిపారు. ఆమెకు సురక్షితమైన పునరావాసం కల్పించాలని కోరినట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించి తీసుకున్న చర్యలను ఏడు రోజుల్లోగా నివేదికను అందించాలని మహిళా కమిషన్ ఆదేశించింది.