ధర్నా చేస్తున్న ఎంపీలకు స్నాక్స్ పంచిన జయా బచ్చన్.. ‘నిరసనకు శక్తి లభిస్తుంది’
పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాల నిరసనలు ఉధృతం అవుతున్నాయి. రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ విధించడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ 12 మంది ఎంపీలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. ఇతర విపక్ష పార్టీల నేతలు వారికి సంఘీభావం ప్రకటించారు. కాగా, ఎంపీ జయా బచ్చన్ కూడా వారి వద్దకు చేరి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వంపై పోరాడాలంటే శక్తి కావాలని పేర్కొన్నట్టు సమాచారం. అలా అంటూ వారికి స్నాక్స్ పంచారు. టీ, బిస్కెట్లనూ ఇచ్చినట్టు తెలిసింది.
న్యూఢిల్లీ: Parliament సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచే విపక్షాల(Opposition) ఆందోళన ప్రారంభమైంది. ప్రభుత్వం ముందు చెప్పినట్టుగానే తొలి రోజే మూడు సాగు చట్టాలను రద్దు చేసే బిల్లును ప్రవేశ పెట్టింది. అదే రోజు రెండు సభలూ ఆ బిల్లును ఆమోదించాయి. కాగా, అదే రోజు రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను ఈ సమావేశాల నుంచి పూర్తిగా సస్పెండ్(Suspension) చేస్తున్నట్టు చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. గత వర్షకాల సమావేశంలో వారి అనుచిత ప్రవర్తనకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అప్పటి ఘటనపై వారు పశ్చాత్తపపడలేదని పేర్కొన్నారు. క్షమాపణలు చెబితే వారిని సమావేశంలోకి అనుమతి ఇస్తామని వివరించారు. కానీ, క్షమాపణలు చెప్పేది లేదని 12 మంది ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వీరికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా సమాజ్వాదీ ఎంపీ, అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్(Jaya Bachchan) కూడా ధర్నాకు దిగిన 12 మంది ఎంపీలకు సంఘీభావం తెలిపారు. ఈ రోజు ఉదయం వారి దగ్గరకు వెళ్లారు. వారితో మాట్లాడారు. అనంతరం, వారికి స్నాక్స్ పంచి ఇచ్చారు. ప్రభుత్వంపై పోరాడటానికి, నిరసన చేయడానికి శక్తి అవసరం అని ఆమె పేర్కొన్నట్టు తెలిసింది. ఇదే సందర్భంగా ధర్నాకు దిగిన 12 మంది ఎంపీలకు ఆమె ఈ రోజు ఉదయం స్నాక్స్ పంచి పెట్టారు. టీ, బిస్కెట్లు కూడా ఇచ్చినట్టు తెలిసింది.
Also Read: MPs suspended: 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. గత సమావేశాల్లో అనుచిత ప్రవర్తనే కారణమని వెల్లడి..
ఈ సస్పెన్షన్పై అటు కాంగ్రెస్, ఇటు తృణమూల్ పార్టీలూ నిరసన చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ నేతలు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేశారు. 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ విధించడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేయగా.. వారు క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్ర పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.
కాగా, ఈ రోజు క్వశ్చన్ అవర్లో రైతు మరణాలపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి లేవనెత్తగా వీ వాంట్ జస్టిస్ అంటూ కాంగ్రెస్ నేతలు నిరసనలు చేశారు. రాజ్యసభ, లోక్సభల్లో ప్రతిపక్షాల నిరసనలు మారుమోగాయి. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. రాజ్యసభ మళ్లీ 2 గంటల వరకు వాయిదా పడగా, లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. కనీస మద్దతు ధరపై బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశాయి.
Also Read: Parliament: పార్లమెంటు భవనంలో అగ్ని ప్రమాదం.. 10 నిమిషాల్లోనే..
సస్పెండ్ చేయబడిన ఎంపీల జాబితా...
1. ఎలమరం కరీం (సీపీఎం)
2. ఫూలో దేవి నేతమ్ (కాంగ్రెస్)
3. ఛాయా వర్మ (కాంగ్రెస్)
4. రిపున్ బోరా (కాంగ్రెస్)
5. బినోయ్ విశ్వం (సీపీఐ)
6. రాజమణి పటేల్ (కాంగ్రెస్)
7. డోలా సేన్ (టీఎంసీ)
8. శాంత ఛెత్రి (టీఎంసీ)
9. సయ్యద్ నాసిర్ హుస్సేన్ (కాంగ్రెస్)
10. ప్రియాంక చతుర్వేది (శివసేన)
11. అనిల్ దేశాయ్ (శివసేన)
12. అఖిలేష్ ప్రసాద్ సింగ్ (కాంగ్రెస్)