సీనియర్ ఐపీఎస్ అధికారి, జమ్మూ కాశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా హత్యకు గురయ్యారు. జమ్మూలోని ఉదయవాలా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో కలకలం రేగింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జమ్మూకశ్మీర్‌ పర్యటన నేప‌థ్యంలో ఈ సంచ‌ల‌న ఘటన వెలుగులోకి రావ‌డంతో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి 

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జమ్మూకశ్మీర్‌ పర్యటన నేప‌థ్యంలో ఓ సంచ‌ల‌న ఘటన వెలుగులోకి వచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, జమ్మూ కాశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ లోహియా హత్యకు గురయ్యారు. తన ఇంట్లో శవమై కనిపించాడు. డిజిపి హేమంత్ లోహియాను పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. అతని సేవకుడు కనిపించకపోవడంతో అతనిపై హత్య అనుమానం వస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పంచనామా నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో, సేవకుడి కోసం అన్వేషణ కూడా ప్రారంభించబడింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి HK లోహియా రెండు నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ జైళ్ల శాఖ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా నియమితులయ్యారు. ఈ ఘటన తర్వాత పోలీసులు, అధికార యంత్రాంగంలో అల‌జ‌డి మొద‌లైంది. హేమంత్ లోహియాను ఎందుకు, ఎవరు చంపారు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 

మ‌రోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి రావ‌డంతో భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోమ‌వారం మధ్యాహ్నం కొంతమంది ఉగ్రవాదులు బారాముల్లాలో ఓ బ్యాంక్ మేనేజర్ పై కాల్పులు జ‌రిపారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌లో బ్యాంక్ మేనేజర్ ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ రెండు ఘ‌ట‌న‌తో జమ్మూ లో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.