ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేకంగా ట్రీట్ చేస్తున్నారు: ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ.. ఒక పట్టాభిషేక కార్యక్రమంగా భావిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటు అంటే ప్రజా గొంతుక అని వివరించారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు బాయ్కాట్ చేశాయి. ప్రారంభోత్సవానికి ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదని, ఇది ప్రజాస్వామ్య విలువలకు గండి పెట్టడమేనని ఆ పార్టీలు వాదించాయి. ఈ తరుణంలో రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీపై ఘాటైన విమర్శలు చేశారు. పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పట్టాభిషేకంగా భావిస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు అనేది ప్రజల గళం అని పేర్కొన్నారు.
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ముందు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి సాంప్రదాయ వస్త్రధారణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గణపతి హోమం నిర్వహించారు. తమిళనాడలోని అధీనాల నుంచి వచ్చిన పండితుల నుంచి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత సెంగోల్ రాజదండాన్ని నూతన పార్లమెంటులో లోక్సభ స్పీకర్ కుర్చీ పక్కన ఉంచారు.
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సుమారు 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించి గౌరవించాలని డిమాండ్ చేశాయి. రాష్ట్రపతి లేని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రజాస్వామ్యానికి దారుణ అవమానం అని, ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నాయి.
Also Read: వృద్ధురాలిని చంపి ఆమె మాంసం తిన్న యువకుడు.. నిందితుడి ముఖమంతా రక్తమే
కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేశ్ ట్విట్టర్లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రధాని మోడీ నియంతృత్వాన్ని నింపుకున్నారని, పార్లమెంటరీ కార్యకలాపాలను ఆయన ద్వేషిస్తారని ఆరోపించారు. పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడంపై కాషాయ శిబిరాన్ని విమర్శించారు.