నాన్నపై ప్రేమతో... తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఐటీ ఉద్యోగి ఆత్మహత్య...
తండ్రి మరణం అతడిని నిలువునా కుంగదీసింది. దీంతో ఆ లోటును తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకున్నాడు.
హైదరాబాద్ : అతడికి నాన్న అంటే బోలెడంత ఇష్టం.. ఆ ఇష్టం, ప్రేమే తండ్రి మరణాన్ని తట్టుకోలేకుండా చేసింది. చివరికి అతడు బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక పోయాడు ఓ యువకుడు. దీంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్ నగర్ భాగ్యలత సమీపంలో ఉన్న అరుణోదయ నగర్ కాలనీలో ఉండే.. తుమ్మలగుట్ట శ్రీకాంత్ (33) ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి తండ్రితో అనుబంధం ఎక్కువ.
ఈ క్రమంలో ఆ ర్నెళ్ల క్రితం అతని తండ్రి అనారోగ్యం కారణంగా చనిపోయాడు. దీంతో శ్రీకాంత్ కృంగిపోయాడు. తండ్రినే పదే పదే తలుచుకునేవాడు. ఎప్పుడూ అదే ద్యాసతో ఉంటూ మానసికంగా తీవ్రంగా కృంగిపోయాడు. అప్పటినుంచి ఎవ్వరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉంటుండే వాడు. ఈ క్రమంలోనే మనసులో జీవితంపై విరక్తి భావనలు పెరిగాయి. ఆదివారం తెల్లవారుజామున దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేరని చూసి.. గదిలో ఉరివేసుకుని మృతి చెందాడు. ఉదయం ఇంటికి వచ్చిన అతని తమ్ముడు ప్రకాష్ లోపలినుంచి తలుపులు పెట్టి ఉండడంతో తలుపులు తట్టాడు. కానీ ఎంతసేపటికీ తలుపులు తెరవలేదు.
దీంతో ఆందోళన చెందిన ప్రకాశ్.. కిటికీ తలుపులు పగలగొట్టి చూశాడు. గదిలో అన్న ఉరికి వేలాడుతూ కనిపించాడు. షాక్ కు గురయ్యాడు. తేరుకుని హయత్ నగర్ పోలీసులకు ఈ మేరకు సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడినుంచి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. శ్రీకాంత్ చనిపోయిన చోట సూసైడ్ నోట్ దొరికింది. అందులో‘తన చావుకు ఎవరూ కారణం కాదని ఉంది. అంతేకాదు అమ్మను మంచినా చూసుకో’ అని... తమ్ముడికి చెప్పుకొచ్చాడు. సోదరుడు ప్రకాశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు మీద దర్యాప్తు చేస్తున్నారు.