టీఎంసీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు.. భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు , మొత్తం రూ.11 కోట్లు పైనే
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా గుట్టల కొద్దీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఓ ఎమ్మెల్యే ఇళ్లు, ఫ్యాక్టరీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది. ఈ సోదాల్లో రూ.11 కోట్లకు పైగా నగదును అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. టీఎంసీ సీనియర్ నేత, మాజీ మంత్రి జాకీర్ హుస్సేన్ ఇళ్లు, కార్యాలయాలపై గురువారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. కోల్కతా, ముర్షిదాబాద్లలో దాదాపు 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలకు దిగారు అధికారులు. ఈ సందర్భంగా గుట్టల కొద్దీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఐటీ దాడులపై జాకీర్ హుస్సేన్ స్పందించారు. ఆ డబ్బుకు సంబంధించి తన వద్ద అన్ని పత్రాలు ఉన్నాయన్నారు. తన కింద 7 వేల మంది పనిచేస్తున్నారని.. వారికి జీతం ఇచ్చేందుకే ఈ నగదును ఉంచినట్లు ఆయన చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ALso REad: మమతా సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐ, ఈడీ లకు వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
ఇకపోతే.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గతేడాది సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశంలో మొదటి సారిగా ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ చేయని విధంగా సీబీఐ, ఈడీ ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకిస్తూ ఓ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. దీంతో కేంద్ర ఏజెన్సీలను వ్యతిరేకించిన తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ అవతరించింది.
ఆ రాష్ట్రంలో స్కూల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కాం, పశువుల అక్రమ రవాణా, బొగ్గు అక్రమార్జన వంటి హైప్రొఫైల్ కేసులను కేంద్ర సంస్థలు విచారిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీఎంసీ ఎమ్మెల్యేలు నిర్మల్ ఘోష్, తపస్ రాయ్ ‘కేంద్ర ఏజెన్సీలు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి ’ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీనియర్ మంత్రి ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అరెస్టు చేయడాన్ని కూడా ఈ తీర్మానంలో ప్రస్తావించారు. చిట్ ఫండ్ కుంభకోణాల్లో బీజేపీ నేతల పేర్లు ఉన్నప్పటికీ, ఏజెన్సీలు ఈ విషయంలో ఒక వైపు మాత్రమే దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నారు.