ISRO latest News:  భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ గగన్‌యాన్, చంద్రయాన్-3 ప్ర‌యోగాల‌పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో సమాధానం ఇచ్చింది. 

ISRO latest News: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన గగన్‌యాన్, చంద్రయాన్-3 మిషన్‌ల ప్ర‌యోగం ఎప్పుడెప్పుడా అని ప్ర‌పంచం మొత్తం వేచి చూస్తుంది. ఈ ఏడాది చివరిలో మానవ సహిత వాహనాన్ని పరీక్షించనుంది. ఈ పరీక్ష పూర్తిగా స్వదేశీ డిజైన్, మోడల్‌తో చేయబడుతుంది. ఎమర్జెన్సీ సమయంలో ఎలా ప‌ని చేస్తుందోన‌ని పరీక్షించాలని ఇస్రో భావిస్తోంది. అయితే 2023 చివరి నాటికి.. మొదటి మానవ సహిత మిషన్‌ను ప్రారంభించవచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇటు కేంద్రం గానీ, అటు ఇస్రో గానీ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. 

గగన్‌యాన్, చంద్రయాన్-3 మిషన్‌లపై  కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ ఓ ప్రశ్నవేశారు. ఆయ‌న‌ అడిగిన ప్రశ్నకు కేంద్రం  సమాధాన‌మిచ్చింది.  ఇస్రో అత్యంత సవాలుతో కూడిన మిషన్‌లలో గగన్‌యాన్ మిషన్ ఒక‌టి. ఈ మిషన్ ద్వారా ముగ్గురు భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అంతేకాకుండా భారత వైమానిక దళానికి చెందిన నలుగురు అధికారులు కూడా ఈ మిషన్ కోసం శిక్షణ తీసుకుంటున్నారు. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌తో కలిసి పనిచేస్తున్నారు. అయితే.. ఇస్రో మాత్రం వారి పేర్లను గోప్యంగా ఉంచారు.

2023లో చంద్రయాన్-3 ప్రయోగం

వాస్త‌వానికి గగన్‌యాన్ ను ఈ ఏడాది చివర్లో ప్ర‌యోగించాల్సి ఉంది. కానీ, చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చంద్రయాన్-3 ద్వారా భారత్ చంద్రునిపైకి ప్రయాణం చేస్తే.. ఆదిత్య మిష‌న్ ద్వారా సూర్యుడుపై ప‌రిశోధ‌న‌లు చేయ‌నుంది.

పార్లమెంట్‌లో అంతరిక్ష శాఖ స్పందిస్తూ.. చంద్రయాన్ 3 మిషన్ , ఆదిత్య ఎల్-1లను 2023 సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రయోగిస్తామని చెప్పారు. చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ అయినా విష‌యం తెలిసిందే.. ఆ వైఫ‌ల్యం నుంచి బ‌య‌ట‌ప‌డి.. చంద్రయాన్-3 కి ఇస్రో సిద్ధమైంది. వాస్త‌వానికి చంద్రయాన్-2 క్రాష్ భారత అంతరిక్ష సంస్థకు అతిపెద్ద నష్టమ‌నే చెప్పాలి.

చంద్రుడిపైకి వెళ్లేందుకు తొందరపడవద్దు: ఇస్రో చీఫ్‌

ఇటీవల ఇస్రో చీఫ్ ఓ  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈసారి చంద్రునిపైకి వెళ్లడానికి తొందరపడటం లేదని చెప్పారు. ప్రతిదీ నిర్ధారించుకోవాలి. చంద్రయాన్-3కి సంబంధించి... ప్రస్తుతం చాలా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఇది కాకుండా, గగన్‌యాన్‌లో అన్ని భద్రతా వ్యవస్థల ఉనికిని నిర్ధారించాలని అన్నారు. దేశం చేప‌డుతున్న‌ మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష ప్ర‌యోగం. ఈ ప్ర‌యోగం ఈ ఏడాది చివ‌రిలో గానీ, వచ్చే ఏడాది జ‌ర‌గ‌వ‌చ్చ‌ని ఆయన చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన మిషన్. మానవులను అంతరిక్షంలోకి పంపినప్పుడు భద్రతపై చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుందని ఇస్రో చీఫ్ చెప్పారు.