యూపీలో మతాంతర జంట హత్య.. ముగ్గురి అరెస్ట్
ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో 18 ఏళ్ల ముస్లిం యువతి, 19 ఏళ్ల దళిత యువకుడు అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
లక్నో: ఒక దళిత యువకుడు, ముస్లిం యువతి ప్రేమించుకున్నారు. అయితే, ఈ మతాంతర జంటను వారి పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఇరువురు అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. యువతి సోదరులే ఈ దారుణానికి ఒడికట్టరనే ఆరోపణలతో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెల్తే.. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో 18 ఏళ్ల ముస్లిం యువతి, 19 ఏళ్ల దళిత యువకుడు అనుమానాస్పద ద్వేషపూరిత నేరంలో చంపబడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మహిళ ముగ్గురు సోదరులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అంకిత్ గౌతమ్ మృతదేహాన్ని చెరకు తోటలో వెలికి తీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్న గౌతమ్ తన యజమాని కుమార్తెతో సంబంధం పెట్టుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ సంబంధాన్ని మహిళ కుటుంబం ఆమోదించలేదని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (బస్తీ) డిఎన్ చౌదరి తెలిపారు. ఈ క్రమంలోనే ఈ దారుణానికి ఒడికట్టి ఉంటారని ప్రథమిక విచారణలో గుర్తించినట్టు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతున్నదని తెలిపారు.
మృతుడు గౌతమ్ సోదరుడు సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ సోదరులైన ఇర్ఫాన్, ఇర్షాద్, ఇర్ఫాన్, ఇష్రార్ లకు వారి ప్రేమ గురించి తెలిసింది. దీంతో వారి కుంటుంబం దీనికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే మాట్లాడాలని గౌతమ్ ను పిలిచారు. వారితో మాట్లాడటానికి వెళ్లిన గౌతమ్ సాయంత్రం అయిన ఇంటికి రాలేదు. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే మరుసటి రోజు ఉదయం అతని మృతదేహాన్ని పొలంలోంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మహిళ కూడా విషం తాగినట్లు తేలింది. అంత్యక్రియలు నిర్వహించగా.. ఆదివారం మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు.
మహిళ విషపూరితమైన పదార్ధం సేవించి ప్రాణాలు కోల్పోగా.. గొంతు నులిమి చంపడం వల్ల గౌతమ్ మరణించాడని వైద్యులు ధృవీకరించారు. సందీప్ ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్ 302, 201, 34, ఎస్సీ/ఎస్టీ చట్టంలోని 3(2) (వీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు. మహిళ తండ్రి పరారీలో ఉన్నారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (బస్తీ) డిఎన్ చౌదరి తెలిపారు.