శివుని చేతిలో మద్యం గ్లాసు పెట్టిన ఇన్స్టాగ్రామ్: బీజేపీ ఆగ్రహం, సీఈవోపై ఫిర్యాదు
సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్స్టాగ్రామ్ .. ఏకంగా పరమేశ్వరుడిని అభ్యంతరకరంగా చూపించింది. ఇన్స్టా స్టిక్కర్లలోని ఒక దాంట్లో... శివుడు ఓ గ్లాస్ పట్టుకొని ఉన్నాడు. ఆ గ్లాస్ చూస్తే... మద్యం గ్లాసులా కనిపిస్తోంది.
హిందూ దేవుళ్లను అవమానకరంగా చూపిస్తూ... భారతీయుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈ-కామర్స్ సైట్లు. గతవారం భారత్లో అత్యంత చెత్త భాష ఏదనే సెర్చ్లో గూగుల్ కన్నడ భాషను పెట్టి అప్రతిష్టపాలైంది. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆతర్వాత రెండు రోజులకు అమెజాన్ కూడా కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. పసుపు, ఎరుపు రంగులతో కూడిన కన్నడ రాష్ట్ర జెండాను ముద్రించిన బికినీని అమెజాన్ తన కెనడా వెబ్సైట్లో అమ్మకానికి ఉచ్చింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్స్టాగ్రామ్ .. ఏకంగా పరమేశ్వరుడిని అభ్యంతరకరంగా చూపించింది. ఇన్స్టా స్టిక్కర్లలోని ఒక దాంట్లో... శివుడు ఓ గ్లాస్ పట్టుకొని ఉన్నాడు. ఆ గ్లాస్ చూస్తే... మద్యం గ్లాసులా కనిపిస్తోంది. అందులోని ద్రవం... రెడ్ వైన్లా కనిపిస్తోంది. అలాగే... శివుడు మరో చేత్తో మొబైల్ పట్టుకొని ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ సెక్షన్లో ఈ స్టిక్కర్ కనిపించడంతో ఢిల్లీకి చెందిన బీజేపీ నేత మనీశ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఇన్స్టాగ్రామ్ సీఈవోపై ఫిర్యాదు చేశారు.
Also Read:మొన్న గూగుల్, తాజాగా అమెజాన్: బికినీపై కర్ణాటక జెండా.. ఈ కామర్స్ సైట్పై భగ్గుమన్న కన్నడిగులు
కోట్లాది మంది భారతీయులు శివుడిని పూజిస్తారని.. వారి మనోభావాలు దెబ్బతినేలా ఇన్స్టాగ్రామ్ అభ్యంతరకరంగా జిఫ్ స్టిక్కర్ రూపొందించిందని మనీశ్ సింగ్ మీడియాకు చెప్పారు. ఇదంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన ఆరోపించాడు. కాగా, మనీశ్ సింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.