మహిళా పోలీసుపై ఇన్ స్పెక్టర్ అత్యాచారం
కేసుకు సంబంధించిన డ్యాక్యుమెంట్స్ తీసుకురావాలంటూ తన తోటి మహిళా పోలీసుకు ఆదేశించాడు. ఆ సమయంలో అతను ఓ హోటల్ గదిలో ఉండటం గమనార్హం.
తోటి మహిళా పోలీసుపై ఓ ఇన్ స్పెక్టర్ అతి దారుణంగా ప్రవర్తించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో.. అతనిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ కు చెందిన రాకేశ్ యాదవ్.. క్రైం బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల అక్టోబర్ 29న ఓ కేసుకు సంబంధించిన డ్యాక్యుమెంట్స్ తీసుకురావాలంటూ తన తోటి మహిళా పోలీసుకు ఆదేశించాడు. ఆ సమయంలో అతను ఓ హోటల్ గదిలో ఉండటం గమనార్హం.
ఇన్ స్పెక్టర్ ఆదేశాల మేరకు సదరు మహిళా పోలీసు ఆ డ్యాక్యుమెంట్స్ తీసుకొని హోటల్ కి వెళ్లింది. కాగా.. అక్కడకు వెళ్లిన తర్వాత.. అతను ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించాడు. దీంతో.. ఆమె కూడా భయంతో ఎవరికీ చెపప్లేదు. అయితే.. దానిని అలుసుగా తీసుకున్న రాకేశ్.. తరచూ ఆమెకు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించాడు. అతని వేధింపులు రోజురోజుకీ ఎక్కువ అవుతుండటంతో తట్టుకోలేక ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు అతనిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. అదుపులోకి తీసుకుందామని ప్రయత్నించగా.. సదరు ఇన్ స్పెక్టర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.