భార్యని కరిచిందని... కుక్కపై భర్త ప్రతీకారం..!
ఇటీవల సదరు కుక్క..నరేంద్ర విశ్వయ్య భార్యను కరిచింది. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన తన లైసెన్స్ డ్ తుపాకీతో కాల్చి చంపేశాడు.
ఆయనకు తన భార్య అంటే ప్రాణం. ఆమెకు ఏదైనా జరిగితే తట్టుకోలేడు. ఈ క్రమంలోనే తన కళ్లముందే పక్కింటి పెంపుడు కుక్క తన భార్యను కరిచింది. అంతే.. కోపంతో ఊగిపోయిన ఆ భర్త.. వెంటనే తుపాకీతో ఆ కుక్కను కాల్చేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండోర్ లోని సుదామానగర్ అపార్ట్ మెంట్ లో నరేంద్ర విశ్వయ్య అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. కాగా.. అతని పక్కింట్లో వారు కుక్కను పెంచుకుంటున్నారు.
అయితే.. ఇటీవల సదరు కుక్క..నరేంద్ర విశ్వయ్య భార్యను కరిచింది. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన తన లైసెన్స్ డ్ తుపాకీతో కాల్చి చంపేశాడు. కాగా.. తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కను చంపేశాడనే కోపంతో సదరు కుక్క యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు నరేంద్రను అదుపులోకి తీసుకున్నారు.
జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం, లైసెన్స్గన్ను దుర్వినియోగం చేయడం వంటి వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని ఇండోర్ పోలీసు అధికారి మనీష్ మహోర్ తెలిపారు.
పోలీసుల విచారణలో ప్రాథమికంగా ఆ కుక్క ఇది వరకే చాలా మందిని కరిచి, గాయ పర్చిందని తెలింది. ఒక వేళ నిందితుడి వాదనే నిజమైతే శునకం యజమానిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.