హైద్రాబాద్లో పెళ్లి: ఇండోనేషియా యువతి భర్త కాశ్మీర్లో మృతి
తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని భర్తతో సుఖంగా జీవిస్తున్న ఓ యువతి జీవితంలో విషాదం నెలకొంది.
శ్రీనగర్: తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని భర్తతో సుఖంగా జీవిస్తున్న ఓ యువతి జీవితంలో విషాదం నెలకొంది. సైన్యం కాల్పుల్లో ప్రాణపదంగా ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త మరణించడంతో తన దేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
ఇండోనేషియా రాజధాని జకర్తాకు చెందిన వైవిక్ విదియాసాతి(సైమా) యునైటెడ్ హెల్త్ గ్రూప్ లో ఆరు మాసాల శిక్షణ కోసం 2014లో హైద్రాబాద్కు వచ్చింది. కాశ్మీర్ కు చెందిన అబిద్ హుస్సేన్ కూడ బెంగుళూరులో ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైద్రాబాద్కు వచ్చాడు. హైద్రాబాద్లోనే సైమాతో అతనికి పరిచయమైంది.
ఈ పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమకు కారణమైంది. అయితే కొన్ని రోజులకే సైమా ఇండోనేషియా వెళ్లిపోయింది. అయితే వారిద్దరూ కూడ తరచూ మాట్లాడుకొనేవారు.రెండేళ్ల తర్వాత అబిద్ ఇండోనేషియాకు వెళ్లి సైమాను అక్కడే పెళ్లి చేసుకొన్నారు. ఇద్దరూ కలిసి హైద్రాబాద్కు వచ్చారు. ఇక్కడే కొంతకాలం ఇద్దరూ ఉద్యోగం చేశారు.
కొన్ని రోజుల తర్వాత సైమాను తీసుకొని అబిద్ హుస్సేన్ కాశ్మీర్ కు వెళ్లాడు. సైమాకు కాశ్మీర్ కు వెళ్లడం ఇష్టం లేదు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత సైమా అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రకృతి అందాలను చూసి ముగ్దురాలైపోయింది. భర్తతో కలిసి అక్కడే ఉంది. ఆ దంపతులకు ఓ పాప పుట్టింది.
ఈ నెల 19వ తేదీన పుల్వామాలోని సిర్నూ గ్రామంలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఈ ఘటనను నిరసిస్తూ స్థానికులు ఆందోళనలను నిర్వహించారు. ఈ ఆందోళనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో సైమా భర్త అబిద్ హుస్సేన్ కూడ మరణించాడు.
భర్తను వద్దని వారించినా కూడ వినకుండా అబిద్ హుస్సేన్ ఆందోళన వద్దకు చేరుకొని ప్రాణాలు కోల్పోయారు. భర్త ప్రాణాలు కోల్పోవడంతో సైమా తిరిగి ఇండోనేషియాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.