ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
ల్యాండ్ అయ్యే సమయంలో క్యాబిన్ డిప్రెజరైజేషన్ కి గురైంది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు
ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. లక్నో నుంచి బెంగళూరు వస్తుండగా.. ల్యాండ్ అయ్యే సమయంలో క్యాబిన్ డిప్రెజరైజేషన్ కి గురైంది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే పైలట్, సిబ్బంది అప్రమత్తతతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఇండిగో విమానం బెంగళూరుకు 240 కిలోమీటర్ల దూరంలో, 11,000 అడుగుల ఎత్తులో ఉండగా ఇండిగో ఫ్లైట్ 6ఈ-6654 క్యాబిన్లో ఇబ్బంది ఎదురైంది. దీంతో విమాన సిబ్బంది అత్యవసర ప్రమాద సంకేతం మేడేను ప్రకటించారు. తక్షణమే ప్రయాణీకులకుఆక్సిజన్ మాస్క్లు అందించారు. అనంతరం బెంగళూరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించి విమాన లాండింగ్ క్లియరెన్స్ కోరారు. వారి అనుమతి మేరకు విమానాన్ని సురకక్షితంగా ల్యాండ్ చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ విమానాన్ని బెంగళూరు సాంకేతిక బృందం తనిఖీ చేస్తోంది. అలాగే ఈ అంశంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు చేస్తోంది.
క్యాబిన్ డిప్రెషరైజేషన్ ఇబ్బంది ఏర్పడితే అత్యవసర పరిస్థితిని తెలియజేస్తూ...‘మేడే’ లేదా ‘పాన్ పాన్’ అనే ప్రమాద సంకేతాన్నివ్వాలి. సంబంధిత ఏటీసీ అధికారుల అనుమతితో ల్యాండ్కావాలి. ప్రయాణీకులందరికీ ఆక్సిజన్ మాస్క్లు అందజేయాలి. కాగా గత ఏడాది మే నెలలో పాకిస్తాన్లోని కరాచీ ఎయిర్పోర్ట్ సమీపంలో ల్యాండ్ అవ్వడానికి ఒక్క నిమిషం ముందు మేడే మేడే సందేశం ఇస్తూనే.. విమానం కుప్పకూలిన ప్రమాదంలో 97 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.