ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా జలుబు సంబంధం కేసులతో ఎక్కువ మంది హాస్పిటళ్ల పాలవుతున్నారు. కొవిడ్ తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా ప్రాణాంతకం కాదని నిపుణులు ధైర్యం చెప్పారు. కానీ, ఈ వైరస్‌తో దేశంలో తొలి మరణం నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక, హర్యానాల్లో తొలి మరణాలు సంభవించాయి. 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భయాలు ఇప్పుడిప్పుడే పలుచబడుతున్న తరుణంలో హెచ్3ఎన్2 వైరస్ ఇన్‌ఫ్లుయెంజా మరోసారి గుబులు పుట్టిస్తున్నది. దేశవ్యాప్తంగా ఈ వైరస్‌తో చాలా మంది హాస్పిటళ్లలో చేరుతుండటం కొంత కలవరం పుట్టించింది. ప్రాణాంతకం కాదనే నిపుణుల మాటలే ధైర్యాన్ని నింపుతున్న సందర్భంలో ఈ వైరస్‌తో మరణాలు సంభవించాయన్న పిడుగు లాంటి వార్త ఇప్పుడు బయటకు వస్తున్నది. కొన్ని ఉన్నత అధికారవర్గాల సమాచారం ప్రకారం, హెచ్‌3ఎన్2 వైరస్ ఇన్‌ఫ్లుయెంజాతో మన దేశంలో తొలి మరణం సంభవించింది. కర్ణాటకలో, హర్యానాలో ఒక్కో మరణం సంభవించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని హసన్ జిల్లాలో మార్చి 1వ తేదీన 82 ఏళ్ల హీరే గౌడ ఇన్‌ఫ్లుయెంజాతో మరణించినట్టు తెలిపాయి.

దేశవ్యాప్తంగా సుమారు 90 హెచ్3ఎన్2 వైరస్ కేసులు రిపోర్ట్ అయినట్టు ఆ వర్గాలు వివరించాయి. ఎనిమిది హెచ్1ఎన్1 వైరస్ కేసులను గుర్తించినట్టు తెలిపాయి. 

కర్ణాటకలో తొలి ఇన్‌ఫ్లుయెంజా మరణం చోటుచేసుకుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వివరించాయి. 

కొవిడ్ తరహా లక్షణాలనే పోలిన ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులు దేశవ్యాప్తంగా పెరిగాయి. ఒక వేవ్ తరహాలో చాలా ప్రాంతాలకు ఈ ఇన్‌ఫ్లుయెంజా పాకింది. ఇందులో చాలా వరకు హెచ్3ఎన్2 వైరస్ కేసులే ఉన్నాయి. ఈ వైరస్‌ను హాంగ్ కాంగ్ వైరస్ అని కూడా పిలుస్తున్నారు. ఇతర ఇన్‌ఫ్లుయెంజా సబ్ టైపుల్లో ఈ హెచ్3ఎన్2 వైరస్ ఎక్కువ మందికి సోకుతున్నది. హాస్పిటళ్లపాలు చేస్తున్నది. 

Also Read: కొవిడ్ తరహా లక్షణాలతో దేశవ్యాప్తంగా భారీగా ఫ్లూ కేసులు.. నిపుణులు చెప్పే సలహాలివే

దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, ఊపిరి ఇబ్బందిగా తీసుకోవడం, జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా వంటి లక్షణాలు ఈ ఇన్‌ఫ్లుయెంజా బారిన పడిన వారిలో కనిపిస్తున్నాయి. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపించే సామర్థ్యం కలిగి ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. దగ్గు, స్నీజింగ్, సన్నిహితంగా మెలగడం ద్వారా ఈ వైరస్ సులభంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

హెచ్3ఎన్2 వైరస్ ఇతర సబ్ టైప్‌ల కంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటుందని, అందుకే ఈ వైరస్ సోకడంతో చాలా మంది హాస్పిటల్‌లో చేరాల్సి వస్తున్నది. గత రెండు మూడు నెలలుగా మన దేశంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్‌ఫ్లుయెంజా సోకిన వారిలో దగ్గు, జ్వరం దీర్ఘకాలం కొనసాగుతున్నాయని వివరించారు. దీర్ఘకాలం ఈ లక్షణాలు ఉంటున్నాయని పేషెంట్లు చెబుతున్నారు.

ఈ ఇన్‌ఫ్లుయెంజా నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతున్నదని సిద్ధ్ హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్ అనురాగ్ మెహ్రోత్రా గత వారం వివరించారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని, దీర్ఘకాలం కొనసాగుతున్నాయని అన్నారు. అంతేకాదు, పేషెంట్ రికవరీ అయినా కొందరిలో ఈ లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు. అయితే, ఇది ప్రాణాంతకమైనదేమీ కాదని క్లినికల్ ట్రయల్ స్పెషలిస్ట్ డాక్టర్ అనితా రమేశ్ చెప్పారు. కానీ, శ్వాసకోశ సంబంధ సమ్యలతో పలువురు పేషెంట్లు హాస్పిటల్‌లో చేరుతున్నారని వివరించారు. కొన్ని లక్షణాలు చాలా వరకు కొవిడ్‌ను పోలి ఉంటున్నాయని, కానీ, తమ వద్దకు వచ్చిన పేషెంట్లు అందరికీ కరోనా నెగెటివ్ అనే వచ్చిందని పేర్కొన్నారు.